Share News

Sitaram Yechury: విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి.. ఏచూరి జీవిత విశేషాలు

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:37 PM

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Sitaram Yechury: విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి.. ఏచూరి జీవిత విశేషాలు

వెబ్ డెస్క్: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 32 ఏళ్లుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న ఏచూరి 2015లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2005 - 2017 వరకు బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.

బాల్యం..

ఆయన పూర్తిపేరు ఏచూరి సీతారామరావు. 1952 ఆగస్టు 12 చెన్నైలో వైదేహి బ్రాహ్మణులైన సర్వేశ్వర సోమయాజులు ఏచూరి,కల్పకం దంపతులకు జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏమారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా పని చేశారు. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారిణిగా ఉండేవారు. ఏచూరి బాల్యం ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగింది. భాగ్యనగరంలోని అల్ సెయింట్స్ హైస్కూల్లో ఆయన మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సీబీఎస్సీ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అనంతరం అక్కడే పీహెచ్‌డీలో చేరారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడం.. ఏచూరిని అరెస్ట్ చేయడంతో పీహెచ్‌డీ కొనసాగించలేకపోయారు.cpm2.jpg


దాంపత్య జీవితం..

సీతారం ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా.. జర్నలిస్టు సీమా చిత్తీ రెండో భార్య. ఏచూరి రెండో భార్య సీమా చిస్తీ జర్నలిస్టు. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొదటి భార్యకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. అయితే కుమారుడు ఆశిష్.. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో మరణించారు.

cpm3.jpgరాజకీయ రంగ ప్రవేశం ఇలా..

తప్పు జరిగితే సహించలేని మనస్థత్వం ఏచూరిది. అందుకే చిన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐ నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు కమ్మూనిస్టు భావజాలానికి ఆకర్షితులై సీపీఎంలో చేరారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ బాధితుల్లో ఏచూరీ కూడా ఒకరు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్‌యూ విద్యార్థి సమాఖ్యకు ఏచూరి మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

cpm0.jpg


సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరాత్తో కలిసి జేఎన్‌యూను వామపక్షాలకు కంచుకోటగా మార్చారు. అనంతరం ఎస్ఎఫ్ఎస్ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు.1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1990లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, 2005లో వెస్ట్ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ విప్లవ సూర్యుడు వీఎస్ అచ్యుతానందన్‌కి ఏచూరి అత్యంత సన్నిహితుడు.cpm1'.jpg

ప్రస్తుత రాజకీయాల్లో..

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక రాజకీయాల ముఖస్వరూపం మారిపోయింది. అయితే ప్రస్తుత రాజకీయాలకు కావాల్సిన నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటూ ఏచూరి ఎదుగుతూ వచ్చారు. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల్లో కీలకంగా ఉన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతోపాటు ఏచూరి కీలక భూమిక పోషించారు. 2004లో అప్పటి యూపీఏ సర్కార్ నిర్మాణంలోనూ ఏచూరిది ప్రముఖ పాత్ర అని చెప్పుకోవచ్చు.

Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత

Updated Date - Sep 12 , 2024 | 05:58 PM