Delhi : విమానాల్లో దొంగ!
ABN , Publish Date - May 15 , 2024 | 03:04 AM
అతడు 110 రోజుల్లో 200సార్లు విమానాలెక్కి దేశమంతా తిరిగాడు. కానీ, అతడు పర్యాటక ప్రేమికుడు కాదు.. రాజకీయ నేత అంతకన్నా కాదు.. అతడో దొంగ. విమాన ప్రయాణికులతో కలిసిపోతాడు. విమానాశ్రయాల్లోనే వారితో మాటలు కలిపేస్తాడు. విమానం ఎక్కాక వారి పక్కనే తాను కూర్చునేలా సిబ్బందిని బతిమాలుకుంటాడు.
110 రోజుల్లో 200సార్లు విమాన ప్రయాణం
న్యూఢిల్లీ, మే 14: అతడు 110 రోజుల్లో 200సార్లు విమానాలెక్కి దేశమంతా తిరిగాడు. కానీ, అతడు పర్యాటక ప్రేమికుడు కాదు.. రాజకీయ నేత అంతకన్నా కాదు.. అతడో దొంగ. విమాన ప్రయాణికులతో కలిసిపోతాడు. విమానాశ్రయాల్లోనే వారితో మాటలు కలిపేస్తాడు. విమానం ఎక్కాక వారి పక్కనే తాను కూర్చునేలా సిబ్బందిని బతిమాలుకుంటాడు.
తర్వాత వారి లగేజీల్లోంచి బంగారు, వెండి నగలు, విలువైన వస్తువులు దోచేస్తుంటాడు. అతడి పేరు రాజేశ్ కపూర్(40). ఢిల్లీలోని పహార్గంజ్లోని నివాసంలో రాజేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. గతనెల హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఓ ప్రయాణికురాలి హ్యాండ్బ్యాగ్లోంచి రాజేశ్ రూ.7లక్షల నగలు దొంగిలించాడు.
మరో విమానంలోరూ.20లక్షల ఆభరణాలు కాజేశాడు. వీటిపై పోలీసులకు ఫిర్యాదులందాయి. ప్రయాణికుల జాబితాను పరిశీలించగా రాజేశ్, ఈ రెండు ఫ్లైట్స్లోనూ ఉన్నాడు. దర్యాప్తులో అతడే దొంగ అని తేలింది. రాజేశ్కు ఢిల్లీలో ‘రికీ డీలక్స్’ పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉంది. అన్నట్టు.. రాజేశ్ అంతకుముందు రైళ్లలోనూ చోరీలు జరిపాడట!