Share News

తల్లితండ్రులకు టీచర్లు ఇచ్చే సలహాలివే!

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:00 AM

మన దేశ భవిష్యత్‌ తరాలను తయారు చేసేది ఉపాధ్యాయులే కాబట్టి వారికి సమాజంలో ఒక ప్రముఖమైన స్థానం ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులు పిల్లలకు సంబంధించిన తల్లితండ్రులకు ఇస్తున్న సలహాలేమిటో చూద్దాం...

తల్లితండ్రులకు టీచర్లు ఇచ్చే సలహాలివే!

నేడు టీచర్స్‌ డే

మన దేశ భవిష్యత్‌ తరాలను తయారు చేసేది ఉపాధ్యాయులే కాబట్టి వారికి సమాజంలో ఒక ప్రముఖమైన స్థానం ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులు పిల్లలకు సంబంధించిన తల్లితండ్రులకు ఇస్తున్న సలహాలేమిటో చూద్దాం...

  • విద్య అంటే పాఠశాలల్లో చెప్పేది మాత్రమే కాదు. స్కూలు అయిపోయిన తర్వాత చదివే పుస్తకాలు.. ఇతరులతో మాట్లాడటం ద్వారా వచ్చే పరిణితి.. వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది పాఠశాలల్లో చెప్పేది మాత్రమే చదువు అనుకుంటారు. అది నిజం కాదు. స్కూలు పూర్తయిన తర్వాత నేర్చుకొనేది కూడా విద్యే. వాస్తవానికి స్కూల్లో బోధించేది కేవలం విజ్ఞానం మాత్రమే! కానీ వాస్తవ ప్రపంచంలో మనకు ఉపయోగించే విషయాలన్నీ మన చుట్టూ ఉన్న సమాజం నేర్పుతుంది.


  • పిల్లల అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పనివ్వాలి. ఒక వేళ వారు తమ అభిప్రాయాలను చెప్పటానికి ఇష్టపడకపోయినా- వారి చేత చెప్పించటానికి ప్రయత్నించాలి. దీని వల్ల వారి ఆలోచనా విధానం మనకు తెలుస్తుంది.

  • ప్రతి విద్యార్థికి 24 గంటలు ఉంటాయి. వాటిలో ఎనిమిది గంటలు స్కూలుకు పోయిందనుకుద్దాం. మరో ఎనిమిది గంటలు ఇతర కార్యక్రమాలకు సరిపోయిందనుకుందాం. మిగిలిన ఎనిమిది గంటలూ వారిని నిద్రపొమ్మని సలహా ఇవ్వాలి. పడుక్కొనే ముందు ఆ రోజు స్కూల్లో జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకోవాలి. మంచి నిద్ర- బుర్రలో ఉన్న ఆలోచనలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో పెట్టుకుంటుంది. దీని వల్ల పిల్లలు లాజికల్‌గా ఆలోచించగలుగుతారు. ఆలోచనలలో చురుకుతనం కూడా పెరుగుతుంది. చాలా మంది పిల్లలు నిద్రను తగ్గించి- ఫోన్లును వాడటం.. టీవీలను చూడటం మొదలైన పనులు చేస్తూ ఉంటారు. దీని వల్ల వారిలో చురుకుతనం తగ్గుతుంది.

  • చాలా మంది టీవీ చూడటం తప్పు అనుకుంటారు. టీవీలు పిల్లల మానసిక అభివృద్ధికి తోడ్పడతాయి. వారికి ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాల గురించి తెలియజేస్తాయి. అయితే ఈ విషయంలో పిల్లలు ఏ ఛానల్స్‌ చూడాలనే విషయంపై స్పష్టత ఉండాలి.


  • పిల్లలతో కానీ.. పిల్లల ఎదురుగా కానీ టీచర్లను తక్కువ చేసి మాట్లాడకూడదు. దీని వల్ల పిల్లల్లో చులకన భావన ఏర్పడుతుంది. ఒక వేళ టీచర్లు ఏదైనా విషయంపై తగిన శ్రద్ధ చూపించటం లేదని భావిస్తే- వారితోనే నేరుగా మాట్లాడాలి. అంతే కాకుండా- పిల్లలతో టీచర్లకు సందేశాలు పంపకూడదు.

  • పిల్లలను సరైన సమయానికి తయారుచేసి.. వారిని స్కూళ్లకు పంపాల్సిన బాధ్యత తల్లితండ్రులదే! తల్లితండ్రులలో క్రమశిక్షణ లేకపోతే- పిల్లలకు కూడా క్రమశిక్షణ ఉండదు.

  • ఫ పిల్లలకు టీచర్లు ఏదైనా పనిష్‌మెంట్‌ ఇస్తే- వారికి మద్దతుగా టీచర్లతో మాట్లాడవద్దు. ఏదైనా తప్పు చేస్తే- శిక్ష అనుభవించాల్సి వస్తుందనే విషయం వారికి తెలియాలి. తమ పిల్లలకు పనిష్‌మెంట్‌ రావటాన్ని కొందరు తల్లితండ్రులు జీర్ణించుకోలేరు. ఆ పనిష్‌మెంట్‌ రావటానికి తామే కారణమని భావిస్తారు. కానీ అది నిజం కాదనే విషయాన్ని తల్లితండ్రులు గుర్తించాలి.

  • ఫ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా- కొందరు తల్లితండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపుతారు. దీని వల్ల ఇతర పిల్లలకు కూడా జలుబు వంటి వ్యాధులు అంటుకోవచ్చు. అందువల్ల పిల్లలకు ఆరోగ్యం బావుండ నప్పుడు- వారిని స్కూలుకు పంపకపోవటమే మంచిది.

  • టీచర్లకు సంబంధించిన ఈమెయిల్స్‌, ఫోన్‌ నెంబర్లు తల్లితండ్రులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి. దీని వల్ల అవసరమైనప్పుడు వారితో మాట్లాడటానికి వీలుంటుంది.

  • స్కూలు, కాలేజీలకు సంబంధించి పిల్లలతో పాజిటివ్‌గానే మాట్లాడాలి. అనవసరపు కామెంట్స్‌ చేయటం వల్ల వారిలో చెడు అభిప్రాయాలు ఏర్పడుతాయి.

Updated Date - Sep 05 , 2024 | 04:00 AM