Share News

YSRCP: సోషల్ మీడియాలో వైసీపీ కుట్రలు..ఏం చేస్తున్నారంటే?

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:05 PM

కుట్రలకు పెట్టింది పేరు వైఎస్సార్‌సీపీ!!. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా పన్నాగాలకు తెరతీయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యలా అనిపిస్తాయి ఆ పార్టీ కుయుక్తులు.

YSRCP: సోషల్ మీడియాలో వైసీపీ కుట్రలు..ఏం చేస్తున్నారంటే?
YSRCP

అమరావతి: కుట్రలకు పెట్టింది పేరు వైఎస్సార్‌సీపీ!!. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా పన్నాగాలకు తెరతీయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యలా అనిపిస్తాయి ఆ పార్టీ కుయుక్తులు. ఇక గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోయిన ఆ పార్టీ ఇప్పుడు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ప్రయత్నాలకు భంగం కలిగించాలని చూస్తోంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికలుగా ఆ పార్టీ కుట్ర బయటపడింది.


ఆంధప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో వైసీపీ కుట్రలకు తెరలేపింది. ఏపీకి పెట్టుబడులు రాకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. యూట్యూబ్ అకాడమీ పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు వైసీపీ సోషల్ మీడియా గండి కొడుతోంది. ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవంటూ యూట్యూబ్, గూగుల్‌కు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతోంది. పెట్టుబడులు పెట్టాలన్నా, అకాడమీ పెట్టాలన్నా హైదరాబాద్‌కు వెళ్లండంటూ వైసీపీ శ్రేణులు సలహాలు, సూచనలు చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఇప్పటికే వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందంటూ ఇప్పటికే ప్రభుత్వం మండిపడుతోంది. ప్రభుత్వ అనుమానాలకు వైసీపీ సోషల్ మీడియా పోస్టింగులు బలం చేకూరుస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు రాకుండా, సంపద సృష్టి జరగకుండా వైసీపీ ఈ పన్నాగం పన్నింది.


ఏపీ పునర్నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి..

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించింది. రెండు నెలల క్రితం ఏర్పడిన టీడీపీ - బీజేపీ –జనసేన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించి క్రమక్రమంగా అడుగులు వేస్తోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డబుల్ ఇంజన్ సర్కార్ కొనసాగుతోంది. సంపద సృష్టిపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీటితో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ఈ రెండింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బృహత్తరమైన ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే అదనపు స్థూల జాతీయ ఉత్పత్తిని అందించడానికి, రాష్ట్రానికి అపారమైన సంపద సృష్టికి దోహదపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని సాధారణ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. కానీ వైఎస్సార్‌సీపీ మాత్రం రాష్ట్రాన్ని ఏవిధంగా దెబ్బతీయాలా అనే కుట్రలకు పాల్పడుతోంది.

Updated Date - Aug 08 , 2024 | 03:49 PM