Viral: పీహెచ్డీ చేశాడు.. ప్రొఫెసర్ ఉద్యోగం వదిలి కూరలు అమ్ముకుంటున్నాడు.. వైరల్ అవుతున్న స్టోరీ..
ABN , Publish Date - Jan 01 , 2024 | 03:44 PM
అతడు పీహెచ్డీ చేశాడు.. అంతకు ముందు నాలుగు సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు కూడా అందుకున్నాడు.. ఆ తర్వాత ఓ కాలేజీలో ప్రొఫెసర్గా చేరాడు.. ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి జీవితం ఎంతో అమోఘంగా ఉంటుందనుకుంటాం.
అతడు పీహెచ్డీ (PhD) చేశాడు.. అంతకు ముందు నాలుగు సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు కూడా అందుకున్నాడు.. ఆ తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్గా (Professor) చేరాడు.. చివరకు తన నిర్ణయం మార్చుకున్నాడు.. పంజాబ్కు (Punjab) చెందిన డాక్టర్ సందీప్ సింగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు (Viral Story).
పంజాబ్కు చెందిన 39 ఏళ్ల సందీప్ సింగ్ నాలుగు సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు, పీహెచ్డీ కూడా పూర్తి చేసి పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసిన సందీప్ 11 ఏళ్లుగా పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్గా ఉన్నారు. అయితే యూనివర్సిటీ సరిగ్గా జీతాలు చెల్లించలేకపోతోంది. అలాగే జీతాల్లో కోతలు విధిస్తోంది. చాలీ చాలని జీతంతో సందీప్ తన కుటుంబాన్ని పోషించడానికి నానా ఇబ్బందులూ పడుతున్నాడు. చివరకు ప్రొఫెసర్ ఉద్యోగం కంటే కూరగాయల వ్యాపారం చేయడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముకుంటున్నారు (Vegetable seller).
``పీహెచ్డీ సబ్జీవాలా`` అనే బోర్డు రాసి ఉన్న బండి మీద ఊరూరా తిరుగుతూ కూరగాయలను విక్రయించడం ప్రారంభించాడు. ఎవరో సందీప్ పరిస్థితి గురించి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ప్రొఫెసర్గా సంపాదించిన దాని కంటే ఎక్కువగా కూరగాయలు అమ్మడం ద్వారా సంపాదిస్తున్నానని సందీప్ సింగ్ చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే సందీప్ ప్రస్తుతం మరో డిగ్రీ సంపాదించే పనిలో ఉన్నారు. ఉదయం కూరగాయలు అమ్ముతూ సాయంత్రం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.