Share News

Harish Rao: ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర

ABN , Publish Date - Aug 30 , 2024 | 09:50 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమన్నారు.

Harish Rao: ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు 10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమని హరీష్ రావు తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక పనులను నిలిపివేయడంతో పాటు, ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ కొనసాగించొద్దని మధ్యంతరంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చిందన్నారు.


దాదాపు పూర్తి కావొస్తున్న ప్రాజెక్టులకు సైతం బిల్లుల చెల్లింపులు నిలిపివేసిందని హరీష్ రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు-భవనాలు, నీటిపారుదల తదితర శాఖలపరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియకు ఆటంకం కలిగిందని.. ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోతున్నారన్నారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక అజెండాతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తిసామర్థ్యాలు లేవని ఇప్పటికే తేలిపోగా, మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని పనుల రద్దుతో స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని.. అభివృద్ధి నిరోధకులుగా ముఖ్యమంత్రి వ్యవరిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.


కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. అయితే ఈ నిధుల నుంచే మార్చి నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు 10 కోట్ల చొప్పున మంజూరు చేసిందని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు ఇచ్చి తన కురచ బుద్ధిని, పక్షపాత ధోరణిని చూపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలపై కక్షతో ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకపోగా పురోగతిలో ఉన్న పనులకు సైతం నిధులు నిలిపివేయడం మరో దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ రద్దు చేసిన ఎస్డీఎఫ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయిలో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదన్నారు.


జిల్లా కలెక్టర్లు, అధికారులు సైతం రద్దు చేసిన పనులకు సంబంధించి ఎలాంటి సమీక్షా జరపలేదన్నారు. కనీసం పురోగతిలో ఉన్న పనుల నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమయ్యారని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని.. ఈ ప్రక్రియలో ప్రజల అవసరాలు మారవని హరీష్ రావు పేర్కొన్నారు. మారేది కేవలం ప్రభుత్వాలు మాత్రమేనని... గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనాలోచిత చర్యలతో తన ఆనవాలునే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ పూరిత రాజకీయాలు చేయడం పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలి. గత ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అవి ప్రజల అవసరాల కోసమే కాబట్టి ఆ పనులను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 09:50 AM