Share News

Rajya Sabha: సింఘ్వీ నామినేషన్‌

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:02 AM

తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డికి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Rajya Sabha: సింఘ్వీ నామినేషన్‌

  • రాజ్యసభ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి

  • హాజరైన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం, మంత్రులు

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డికి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఒక్కో సెట్‌కు పది మంది చొప్పున 40 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అభిషేక్‌ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేశారు. తొలి సెట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సంతకం చేశారు.


సింఘ్వీ నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీజేఎస్‌ ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. తొలుత సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్న సింఘ్వీ.. అక్కడి నుంచి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ చాంబర్‌కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.


ఆ వెంటనే సింఘ్వీ నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. వాస్తవానికి ఆయన సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ, కర్ణాటకలో ముడా కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తరఫున హైకోర్టులో వాదనలు వినిపించాల్సి ఉండడంతో బెంగళూరుకు వెళ్లారు. కాగా, సింఘ్వీ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రావడంతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది. సింఘ్వీ వెళ్లిపోయిన తర్వాత సీఎం రేవంత్‌.. సీఎల్పీ కార్యాలయంలోని తన చాంబర్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమై.. పిచ్చాపాటిగా మాట్లాడారు.

Updated Date - Aug 20 , 2024 | 03:02 AM