Kumaram Bheem Asifabad: మంత్రి సీతక్క పేరిట వసూళ్ల దందా
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:02 PM
కాగజ్నగర్, ఏప్రిల్ 18 : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పేరిట సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. గురువారం తన నివాసంలో ఆయన మాట్లాడారు.
-ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
కాగజ్నగర్, ఏప్రిల్ 18 : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పేరిట సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. గురువారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైస్మిల్లింగ్ పౌరసరఫరాలకు ఇవ్వగా సిర్పూ రులో మాత్రం రైస్మిల్లింగ్ వ్యవస్థను ఎఫ్సీఐకి ఇవ్వటమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాము గతంలోనే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రైస్మిల్లర్లను బెదిరించి మళ్లీ అక్రమ వసూళ్లకు పాల్పడేందుకు ఈ చర్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ దందాలో కూడా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అల్లుడు రావి శ్రీనివాస్ హస్తం ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గానికి ఆర్డబ్ల్యూఎస్ నిధులు రూ.6కోట్లు మంజూరు కాగా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు పనులు కేటాయించాలని రావి శ్రీనివాస్ సిఫార్సు చేయటం, మంత్రి వాటిపై సంతకం పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానికంగా ఉండే మహిళా వైద్యురాలిని భయాంబ్రాంతులకు గురిచేసి లక్షల్లో డబ్బులు డిమాండు చేయటం దారుణమన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ సర్వేనెంబరు 146/2లోని వెంచర్ వేయగా, ఇందులో కూడా డబ్బులు వసూలు చేసినట్టు పేర్కొన్నారు. మంత్రి సీతక్క పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిని వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈర్ల విశ్వేశ్వర్రావు, వీర భద్రాచారి, సిందం శ్రీనివాస్, కొప్పుల శంకర్, గోలేం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.