Share News

Hyderabad: ట్రాఫిక్‌ వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు!

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:10 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లను వలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.

Hyderabad: ట్రాఫిక్‌ వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు!

  • క్లీన్‌ సిటీ కోసం ఇండోర్‌ మోడల్‌ అనుసరించండి

  • పనులు చేయని కాంట్రాక్టర్ల నివేదిక ఇవ్వండి

  • జీహెచ్‌ఎంసీ పనులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లను వలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల నియాకమం చేపట్టాలన్నారు. దానివల్ల వారికి ఉపాధి కూడా కల్పించినట్లవుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో జీహెచ్‌ఎంసీ పౌర సేవల కోసం చేపట్టిన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఇండోర్‌ తరహాలో క్లీన్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అక్కడ అనుసరిస్తున్న విదానాలను అధ్యయనం చేయాలని చెప్పారు.


మూసీ పరివాహక ప్రాంతంలో స్థలాలు సేకరించే సమయంలో అక్కడి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని చెప్పారు. హైదరాబాద్‌లో సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ) కింద ఐదేళ్ల క్రితం 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబరుతో కాంట్రాక్టు గడువు ముగిసిపోతుందని, రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్ల వివరాలతో 15 రోజుల్లోగా తనకు నివేదికను అందించాలని చెప్పారు. అలాగే, చెత్త సేకరణపైనా జీహెచ్‌ఎంసీ దృష్టి సారించాలని ఆదేశించారు.


అవసరమైతే జీఐఎస్‌, క్యూఆర్‌ స్కాన్‌ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. అద్దెలు, ప్రకటనలు, హోర్డింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయంపై సమీక్షించుకోవాలన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నందున పరిసరాల్లోని రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటుకు తరలించాలని చెప్పారు. స్టేషన్‌ ముందు పార్కింగ్‌, వాణిజ్య కూడలికి వీలుగా అప్రోచ్‌ రోడ్లు డిజైన్‌ చేసుకోవాలని తెలిపారు.

Updated Date - Sep 14 , 2024 | 03:10 AM