Share News

CM Revanth Reddy: కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు

ABN , Publish Date - Jan 27 , 2024 | 10:44 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.

CM Revanth Reddy: కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలన్నారు. హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వద్దని ఇరిగేషన్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని.. తదుపరి మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

గతంలో అధికారంలో ఉన్న వాళ్లు తప్పులు చేయడం వల్ల ఇప్పటికే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని.. ఈ భారీ ప్రాజెక్టు రిపేర్లకు పదివేల కోట్ల ఖర్చైనా ఆలోచించొద్దని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో భాగంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రెండు, మూడు రోజుల్లోనే వాళ్లతో మరో సమావేశం ఏర్పాటు చేయాలని.. తనతో పాటు ఇరిగేషన్ మంత్రి కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను రిపేర్లు చేయిస్తే సరిపోతుందా? ఉన్నవి తొలగించి కొత్తవి కట్టాలా? కొన్నింటిని రిపేర్లు చేసి కొన్నింటిని కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా? అనేది ఈ కమిటీతో అధ్యయనం చేయిస్తామన్నారు.


కృష్ఱా జలాల్లో తెలంగాణ నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణ జలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు, కేఆర్ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడేం చర్చలు జరిగాయి? ఏయే నిర్ణయాలు జరిగాయన్న విషయాలపై సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనల్లో నిజమెంత? అప్పుడు నిర్ణయాలు తీసుకున్నదెవరు? అనే వివరాలన్నింటినీ ప్రజల ముందు ఉంచాలని అన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగే సలహాలు, సూచనలు తప్పకుండా ప్రభుత్వం స్వీకరిస్తుందని స్పష్టం చేశారు.

మరోవైపు.. సచివాలయంలో శనివారం జరిగిన సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లు వస్తున్న ఆరోపణలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. ఏ ప్రాజెక్టు అప్పగించలేదని, ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. కృష్ణా బోర్డుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు మీటింగ్‌లు జరిపింది? ఎవరెవరు ఈ సమావేశాలకు హాజరయ్యారు? అంటూ ఇరిగేషన్ విభాగంపై విమర్శలు వస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీగా రాజకీయ విమర్శలు చేయడం వేరని, శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి? కృష్ణా జలాల్లో ఎంత వాటా ఉందో వాళ్లకు తెలియదా? వాటాకు మించి నీటిని తోడుకుపోతుంటే పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఏం చేసిందో.. అఖిల పక్ష సమావేశంలో చర్చకు పెడుదామని సీఎం అన్నారు.

ఇదే సమయంలో.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని.. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాధాన్యతలవారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వీలైనంత త్వరగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని, దీన్ని పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాలన్నారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించాలని.. ప్రాధాన్యతా క్రమంలో ముందున్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను వందశాతం పూర్తి చేయాల్సిందేనని.. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Updated Date - Jan 27 , 2024 | 10:44 PM