Share News

CM Revanth Reddy: వైద్యాధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

ABN , Publish Date - Aug 27 , 2024 | 08:01 PM

రాష్ట్రంలో డెంగ్యూ, ఇతర జ్వరాలకు సంబంధించిన మరణాల లెక్కలను దాస్తున్నారంటూ విపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అధికారుల పనితీరుపై ఆయన సీరియస్ అయ్యారు.

CM Revanth Reddy: వైద్యాధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

హైదరాబాద్: రాష్ట్రంలో డెంగ్యూ, ఇతర జ్వరాలకు సంబంధించిన మరణాల లెక్కలను దాస్తున్నారంటూ విపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అధికారుల పనితీరుపై ఆయన సీరియస్ అయ్యారు. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో కేసులు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెల్త్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే సస్పెండ్ చేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు.


రేపు తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ

రేపు (బుధవారం) సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ జరగనుంది. ఉదయం 11 గంటలకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.


లిక్కర్ స్కామ్‌లో కవిత మెయిన్ విలన్: జగ్గారెడ్డి

లిక్కర్ స్కామ్‌లో కవిత మెయిన్ విలన్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్‌లోనే కవితకు బెయిల్ వచ్చిందని, రాజకీయ చీకటి ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్ లభించిందని ఆరోపించారు. ఈ మేరకు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్‌కు ఎందుకు బెయిల్ ఇవ్వలేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. 15 నెలలు వరకు సిసోడియాకు బెయిల్ ఇవ్వలేదని, 5 నెలలకే కవితకు ఎందుకు బెయిల్ ఇచ్చారో అని వ్యాఖ్యానించారు.


‘‘కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్‌ను ఢీకొనలేక బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కూటమిగా పోటీ చేస్తాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోవడంలో భాగంగానే లిక్కర్ స్కామ్‌లో కవిత జైలు నాటకం. బెయిల్ రాక ముందే 3 రోజుల నుంచి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. జడ్జి చెప్పక ముందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బెయిల్ వస్తుందని లీక్‌లు ఇస్తున్నారు. కేసీఆర్ కుటుంబంపై జ్యుడీషియల్‌గా చర్యలు తీసుకోవాలి. కవిత బెయిల్ అంశం దేశ రాజకీయాలలో కొత్తగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులను న్యూట్రల్ చేసి బీజేపీకి ఓటు వేయించారు. ట్రబుల్ షూటర్ అంటున్న హరీష్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంది. మోదీ తన బలం పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాన్ని కుదుర్చుకుండు. బీజేపీ వెనుక ఉందనే ధైర్యంతో హరీష్ రావు, కేటీఆర్‌లు మాట్లాడుతున్నారు’’ అని జగ్గారెడ్డి ఆరోపించారు.

Updated Date - Aug 27 , 2024 | 08:10 PM