Hyderabad: ఎంఎంటీఎస్ రెండోదశకు పచ్చజెండా.. ప్రధాని చేత ప్రారంభోత్సవానికి సన్నాహాలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:25 PM
గ్రేటర్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ రెండో దశ(MMTS second stage) సర్వీసులు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
- మూడో వారంలో రైలు కూతకు చాన్స్
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ రెండో దశ(MMTS second stage) సర్వీసులు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగమైన ఘట్కేసర్-సనత్ నగర్ మార్గంలో ఎంఎంటీఎస్ సేవలను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రెండో దశలో ఒక మార్గాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నందున కోచ్లను సిద్ధం చేయాలని రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ తాజాగా వివిధ విభాగాల ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ బోగీలు కొత్తవి అందుబాటులో లేనందున, ఇప్పటికే నడుస్తున్న రైళ్ల(12కోచ్ల) నుంచి మూడేసి బోగీలు తీసి, వాటికి రంగులు వేసి సిద్ధం చేయాలని కోరారు. ప్రధానితో ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రస్తుతానికి రెండు రైళ్లను సిద్ధం చేయాల్సి ఉన్నందున, వీలైనంత త్వరగా పాత బోగీలను లాలాగూడ వర్క్షా్పకు తరలించాలని కోరారు.