Share News

Hyderabad: కనెక్ట్‌ చేస్తే.. జర్నీ ఈజీ! మెట్రో లింకులపై నగరవాసుల ఆశలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:43 AM

నగరంలో అత్యంత అనుకూలమైన రవాణా సాధనంగా మెట్రో మారింది. ఇప్పటికే మొదటి దశ మూడు కారిడార్లలోని 57 స్టేషన్ల గుండా నిత్యం 1028 సర్వీసులు నడుస్తున్నాయి.

Hyderabad: కనెక్ట్‌ చేస్తే.. జర్నీ ఈజీ! మెట్రో లింకులపై నగరవాసుల ఆశలు

- జేఎన్‌టీయూ - హైటెక్‌సిటీతో ప్రయోజనం

- ఐటీ కారిడార్‌లో సులువుగా ప్రయాణించే అవకాశం

- జేబీఎస్‌ - కూకట్‌పల్లి అనుసంధానంతోనూ మేలైన రవాణా

- బయోడైవర్సిటీ జంక్షన్‌ - లక్డీకాపూల్‌ కలిస్తే ట్రాఫిక్‌ ఫ్రీ జర్నీ

మెట్రో విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో నగరవాసుల ఆశలు చిగురిస్తున్నాయి. రెండో దశ విస్తరణ కింద చేపడుతున్న పొడిగింపులకు అదనంగా మరిన్ని చేపడితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఒక ప్రాంతానికి, మరో ప్రాంతం కలుపుతూ చిన్న ప్రాజెక్టులు చేపట్టి లింకులు కలిపితే నగరమంతా ట్రాఫిక్‌ చిక్కులు లేని ప్రయాణానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆ దిశగా సర్కారు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరంలో అత్యంత అనుకూలమైన రవాణా సాధనంగా మెట్రో మారింది. ఇప్పటికే మొదటి దశ మూడు కారిడార్లలోని 57 స్టేషన్ల గుండా నిత్యం 1028 సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివిధ మార్గాలను అనుసంధానం చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. కానీ.. ఆచరణలో శ్రద్ధ చూపించకపోవడంతో అవి అందని ద్రాక్షగానే మిగిలాయి. కొత్త సర్కారు త్వరగా మెట్రో కనెక్ట్‌విటీపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

లింకులు కలిపితే..

గత ప్రభుత్వం గాలికి వదిలేసిన ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా (5.5 కిలోమీటర్ల) పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తిచేస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో వేస్తామని చెప్పడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండో దశ విస్తరణ కింద చేపడుతున్న పొడిగింపులకు అదనంగా మరిన్ని చేపడితే ప్రయోజనం ఉంటుందని రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు. కారిడార్‌-3 నాగోలు-రాయదుర్గం మార్గంలోని హైటెక్‌సిటీ - జేఎన్‌టీయూ (5.28 కిలోమీటర్ల)ను కలపడం ద్వారా ఐటీ కారిడార్‌లో వాహనాల ఒత్తిడిని భారీగా తగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మార్గం వీలు కాకుంటే హైటెక్‌సిటీ నుంచి వయా కొండాపూర్‌, హఫీజ్‌పేట్‌, ఆల్విన్‌కాలనీ ఎక్స్‌రోడ్‌ వరకు (6.39 కిలో మీటర్లను) కలిపినా ప్రయాణికులకు దూరభారం తగ్గనుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, పరిసర ప్రాంతాల నుంచి ఎవరైనా హైటెక్‌సిటీకి రావాలంటే మియాపూర్‌లో మెట్రో ఎక్కి అమీర్‌పేట్‌కు వెళ్లాల్సి ఉంది. తర్వాత అక్కడ దిగి జంక్షన్‌లో రెడ్‌లైన్‌ నుంచి బ్లూ లైన్‌కు మారి మరో మెట్రో రైలు ఎక్కి హైటెక్‌సిటీకి వెళ్లాలి. అదే ఆల్విన్‌కాలనీ ఎక్స్‌ రోడ్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు బ్లూ, రెడ్‌ లైన్లను కలుపుతూ మరో మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులకు ప్రయాణం సులభతరం కానుంది.

ప్రతిపాదిత మార్గాలకు అనుసంధానంగా..

కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో దశలో ప్రతిపాదించిన రాయదుర్గం - బయోడైవర్సిటీ జంక్షన్‌ - ఐఐఐటీ జంక్షన్‌ - ఐఎ్‌సబీ రోడ్డు - విప్రో లేక్‌-అమెరికన్‌ కాన్సులేట్‌ (ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌)కు అనుసంధానంగా లక్డీకపూల్‌ వరకు కూడా మెట్రోరైలును నడిపిస్తే బాగుంటుందని నగరవాసులు ఆశిస్తున్నారు. బయో డైవర్సిటీని జంక్షన్‌గా చేస్తున్న తరుణంలో అక్కడి నుంచి షేక్‌పేట్‌, టోలీచౌకీ, నానల్‌నగర్‌, మెహిదీపట్నం మీదుగా లక్డీకపూల్‌కు రైలు తీసుకురావాలని కోరుతున్నారు. దీని వల్ల లక్డీకపూల్‌-మెహిదీపట్నం మార్గంలో ట్రాఫిక్‌ ఫ్రీ జర్నీని పెద్ద ఎత్తున అందించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు జేబీఎస్-కూకట్‌పల్లి వై జంక్షన్‌ (9.6 కిలోమీటర్లను), జేబీఎస్-అల్వాల్‌ (8 కిలో మీటర్లు) పూర్తి చేయడం ద్వారా పరి సరాల్లో రోడ్లపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గనుందని స్థానికులు భావిస్తున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:43 AM