ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్లో ఎంట్రీలు చేయాలి
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:59 PM
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు.
- జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 30 : కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మంగళవారం ధాన్యం సేకరణ, ట్యాబ్లో ఎంట్రీ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేపీ, డీసీఎంఎస్, సింగిల్ విండోలు, మెప్మల ఆధ్వర్యంలో ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలు ట్యాబ్లో ఎంట్రీ చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకొచ్చిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు. ట్యాబ్లో ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, మెప్మల ఆధ్వర్యంలో ఇప్పటి దాక 11,946 మంది రైతుల నుంచి 80,827 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. మొత్తం రూ.84 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్రెడ్డి, జిల్లా మేనేజర్ జితేందర్ప్రసాద్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ప్రవీణ్కుమార్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.