సమ్మె విజయవంతం
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:30 AM
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతికేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయింది.
సుభాష్నగర్, ఫిబ్రవరి 16: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతికేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయింది. జిల్లాలోని 16 మండలాల్లో కార్మికులు ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, తహసీల్దారు కార్యాలయాల ఎదుట దర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గీతాభవన్ చౌరస్తానుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కార్మిక హక్కులను కాపాడడం, వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో పెట్టుబడిదారులకు ఆదర్శ యజమానిగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు. కార్మికులు ఒంటరిగా లేరన్న విషయాన్ని ఈ సమ్మె గుర్తు చేసిందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే వరకు ఐక్య కార్యాచరణ కొనసాగుతుందన్నారు. మత, భాష, ప్రాంతీయ బేధాల కంటే తమ ఐక్యతే తమకు రక్ష అని కార్మికులు గర్తించారని అన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సర్వ ఆయుధాలను ఉపయోగించారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ తీసుకురావడం వల్ల కార్మిక హక్కులు పూర్తిగా నర్వీర్యం అయ్యాయని అన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్ రోడ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతున్నారని ఆరోపించారు. నేషనల్ హెల్త్ మిషన్, ఐసీడీఎస్, ఉపాధి హామీ, మధ్యాహ్న భోజనం వంటి పథకాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులో కోత పెట్టి, ఆ పథకాలను పూర్తిగా లేకుండా చేస్తున్నారన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం వేతనం అమలు చేయాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బడ్జెట్ కేటాయించడంలేదని, కనీస వేతనం అమలు చేయడంలేదని ఆరోపించారు. అసంఘటిత కార్మికులైన డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులకు సామాజిక భద్రత కల్పించలేదన్నారు. ఈ సమ్మెకు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్యూరి వాసుదేవరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొయ్యడ సృజన్కుమార్, టీడీపీ నాయకుడు కళ్యాడపు ఆగయ్య, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథ నాయకుడు జూపాక శ్రీనివాస్, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి బామండ్ల రవీందర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వర్ణ వెంకట్రెడ్డి, జనగాం రాజమల్లు, గుడికందుల సత్యం, పున్నం రవి, అసోద రవీందర్, రాజమల్లయ్య, కవ్వంపెల్లి రవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.