హర హర మహాదేవా
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:20 AM
హర హర మహాదేవా.. శంభో శంకర.. కోడెమొక్కుల రాజన్నకు కోటీ దాండాలు అంటూ రాజన్న నామస్మరణతో వేములవాడ దేవస్థానం పరిసరాలు మార్మోగాయి.
వేములవాడ టౌన్, జూన్ 17 : హర హర మహాదేవా.. శంభో శంకర.. కోడెమొక్కుల రాజన్నకు కోటీ దాండాలు అంటూ రాజన్న నామస్మరణతో వేములవాడ దేవస్థానం పరిసరాలు మార్మోగాయి. సోమవారం రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ ఆవరణలో సందడి నెలకొంది. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. కోడెమొక్కు చెల్లించుకునే భక్తులు క్యూలైన్లో సుమారు 4 గంటలపాటు నిరీక్షించారు. గండాలు తలగిపోవాలని గండాదీపంలో నూనె పోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. కున్నారు. అనుబంధ ఆలయాలైన బద్దిపోచమ్మ, నగరేశ్వర, భీమేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అభిషేక పూజలను రద్దీ చేశారు. సోమవారం పార్వతీ పర మేశ్వరులను దర్శించుకునేందుకు 50 వేల మందికిపైగా భక్తులు వచ్చినట్లు, రూ.30 లక్షల వరకు ఆయా విభాగాల ద్వారా ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు అంచానా వేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు, తిరుపతిరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఫ రాజన్న దర్శనం స్వగ్రామాలకు భక్తులు తిరుగు ప్రయాణ మయ్యారు. దీంతో సోమవారం సాయంత్రం భక్తులు ఒక్కసారిగి తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండుకు తరలిరావడంతో రద్దీగా మారిపోయింది. కరీంనగర్, వరంగల్, హన్మాకొండ, సికింద్రాబాద్, కోరుట్ల, మెట్పల్లి బస్స్టాప్ల వద్ద భక్తులు, ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించారు. ఆర్టీసీ బస్సుల రాకా ఆలస్యం కావడంతో భక్తులకు తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు తప్పడం లేదు.