మహిళ దారుణ హత్య
ABN , Publish Date - May 24 , 2024 | 11:01 PM
మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేటకు చెందిన దాసరి లక్ష్మి(40) గుర్తు తెలియని వ్యక్తి చేతిలో శుక్రవారం దారుణ హత్యకు గురైంది. భూత్పూర్ మునిసిపాలిటీలోని అమిస్తాపూర్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.
బ్లేడుతో గొంతు కోసి.. బండరాయితో మోది
గుర్తు తెలియని వ్యక్తి కిరాతకం
మృతురాలు గాజులపేటకు చెందిన లక్ష్మిగా గుర్తింపు
భూత్పూర్, మే 24: మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేటకు చెందిన దాసరి లక్ష్మి(40) గుర్తు తెలియని వ్యక్తి చేతిలో శుక్రవారం దారుణ హత్యకు గురైంది. భూత్పూర్ మునిసిపాలిటీలోని అమిస్తాపూర్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమిస్తాపూర్ శివారులో ఉన్న గిరిధార్ వెంచర్ సమీపంలో కొత్తగా నిర్మాణంలో ప్రహరీ లోపల రక్తపు మడుగులో ఉన్న మహిళ మృతదేహాన్ని అమిప్తాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ శ్రీనివాసులు, సీఐ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి మహిళ గొంతు బ్లేడుతో కోసి, తలపై బండ రాయితో మోది హత్య చేసినట్లు గుర్తించారు. మృత దేహం కుడి చేతిపై యాదమ్మ అనే పేరు పచ్చ బొట్టు ఉంది. పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్టు ధరించింది. రెండు చేతులకు గాజులు ఉన్నాయి. పక్కన పసుపు పచ్చ చేతి సంచి ఉంది. మృతదేహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శుక్రవారం సాయంత్రం బంధువులు ఆమెను మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేటకు చెందిన లక్ష్మిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మునిసిపాలిటీ వార్డు అధికారి చంద్రశేఖర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
మహిళ వెంట అనుమానితుడు
హత్యకు గురైన లక్ష్మి కేసును ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. హత్య జరిగిన ప్రదేశం సమీపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలీంచగా ఆమె వెంట ఓ గుర్తు తెలియని వ్యక్తి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. అతను ఎవరు?, ఎక్కడి నుంచి వచ్చాడనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఎస్ఐ శ్రీనివాసులుతో సీఐ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.