ఆకట్టుకున్న నమూనా మండల సమావేశం
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:11 PM
మండలంలోని చిన్నపొర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన నమూనా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అందరిని ఆకట్టుకుంది.
చిన్నపొర్ల పాఠశాల విద్యార్థులను ప్రశంసించిన అధికారులు
ఊట్కూర్, మార్చి 12 : మండలంలోని చిన్నపొర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన నమూనా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అందరిని ఆకట్టుకుంది. ప్రజాప్రతినిధులుగా గ్రామాల సమస్యల పరిష్కారం కోసం సభ్యులు ప్రశ్నలను లెవనెత్తగా అధికారులు, ఎమ్మెల్యే సమాధానాలు ఇవ్వడం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రజా సమస్యలపై సభలో వాదోపవాదాలు వాడివేడిగా చర్చలు చేయడం చూస్తుంటే నిజంగా ప్రజాప్రతినిధుల సమావేశం జరిగినట్లు అనిపించింది. స్థానిక ఎమ్మెల్యేగా విద్యార్థి వేణు, జడ్పీ చైర్పర్సన్గా శిరీష, ఎంపీగా భరత్, ఎంపీపీగా అర్చన ఎంపీడీవోగా నందిని, తహసీల్దార్గా ప్రణిత, ఎస్ఐగా లతకుమారి, డాక్టర్గా నవ్య వ్యవహరించారు. 52 మంది విద్యార్థులు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులుగా వ్యహరించారు. సభలో గ్రామాల వారి సమస్యలు చర్చించడం కొందరు సభ్యులు అధికారులను నిలదీయడం, ఎంపీ, ఎమ్మెల్యేలు దానికి దీటుగా సమాధానం ఇస్తూ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించడం జరిగింది. ముఖ్య అతిథులుగా పొల్గొన్న జిల్లా సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు వివిధ పాత్రల్లో లీనమై సభను విజయవంతం చేశారని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులకు నిర్వహిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు రాయల్ హెన్నా, జగన్నాథ్రావు, నరసింహా, భాస్కర్, శ్రీధర్, సీఆర్పీ రాజశేఖర్, రేవతి, జ్యోతి, రఘు పాల్గొన్నారు.