చారిత్రాత్మక కట్టడానికి పూర్వ వైభవం తీసుకొస్తాం
ABN , Publish Date - May 23 , 2024 | 11:08 PM
వనపర్తికే తలమానికమైన చారిత్రాత్మక కట్టడం కృష్ణదేవ రాయ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకొస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
- మార్నింగ్ వాక్లో పాలిటెక్నిక్ భవనం పరిశీలన
వనపర్తి టౌన్, మే 23 : వనపర్తికే తలమానికమైన చారిత్రాత్మక కట్టడం కృష్ణదేవ రాయ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకొస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఆటవిడుపుగా కాసేపు క్రికెట్, ఫుట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన రాజ ప్రసాదాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా బాగు చేయిస్తామన్నారు. మైదానం లో ఉన్న పురాతన బావికి జాలి ఏర్పాటు చేయడంతో పాటు ఉదయపు నడక కోసం వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామన్నారు. అదేవిధంగా త్వరలోనే హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ గంజ్ కాలనీలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.
క్రీడా స్పూర్తితో ఆడాలి
పెద్దమందడి : క్రీడాకారులు క్రీడాస్పూర్తితో ఆడాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రా మంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్రెడ్డి తల్లిదండ్రులైన వెంకటమ్మ, సాయిరెడ్డిల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలు పోటములను సమానంగా తీసుకోవాలని అన్నారు. యువకులు చెడు మార్గాలకు ఆకర్షితులవకుండా ఉన్నతమైన మార్గాలను ఎంచుకొని భవి ష్యత్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు దామోదర్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చాపల సత్యారెడ్డి, మాజీ సర్పంచ్ పుట్టమోని నారాయణ, కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఉన్నారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో గాయపడి వనపర్తిలోని సుధా నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్న జంగం ఆంజనేయులును ఎమ్మెల్యే పరామర్శించారు.