మరికల్, ధన్వాడ మండలాలను దత్తత తీసుకుంటా
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:18 PM
ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే ధన్వాడ, మరికల్ మండలాలను దత్త తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు.
-కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి
ధన్వాడ, ఏప్రిల్ 18 : ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే ధన్వాడ, మరికల్ మండలాలను దత్త తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడలో ఓ ఫంక్షన్హాల్లో మరికల్, ధన్వాడ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధన్వాడ ఉమ్మడి మండలం నుంచి పర్ణికారెడ్డికి వచ్చిన మెజార్టీకన్న తనకు ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన ఈ మండలాలకు కావాల్సిన నిధులు తీసుకువస్తానన్నారు. మరికల్కు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధన్వాడలో డిగ్రీ కళాశాల నూతన భవనానికి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సైతం నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్ల లాంటివని చెప్పారని తెలిపారు. గత పాలకులు ఈ ప్రాంతం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డిలను శాలువల తో ఘనంగా సన్మానించారు. అనంతరం మండలా నికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల శివకూమార్, దన్వాడ, మరికల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి, వీరన్న, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న రెడ్డి తదితరులు ఉన్నారు.
నామినేషన్ పత్రాలతో పూజ
మహబూబ్నగర్ : కాంగ్రెస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా గురు వారం పట్టణంలోని లక్ష్మీనర్సింహ్మ స్వామి ఆలయంలో వంశీచంద్రెడ్డి తన భార్య అశ్లేషారెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ మీ బిడ్డగా ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం కల్పించాలనే సంకల్పంతో పోటీ చేస్తున్న తనకు ప్రజల మద్దతు, దీవెనలతో పాటు భగవంతుని ఆశిస్సులు కావాలని కోరారు.