రైతులకు అందుబాటులో విత్తనాలు
ABN , Publish Date - Jun 06 , 2024 | 11:46 PM
జిల్లాలో రైతులందరికీ సరిపడా పత్తి, వరి, ఇతర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ అన్నారు.
- జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్
- ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ
ఊట్కూర్, జూన్ 6 : జిల్లాలో రైతులందరికీ సరిపడా పత్తి, వరి, ఇతర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని విత్తనాలు మరియు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయ బిల్లులను, స్టాక్ను తనిఖీ చేశారు. ప్రతీ వస్తువు అమ్మకం, కొనుగోలు రికార్డును తప్పకుండా మెయింటెన్సె చేయాలన్నారు. ఈ వర్షాకాలంలో కావల్సినని విత్తనాలు ఉన్నాయని, ప్రధానంగా రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతీ షాప్లో విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినా లేదా అమ్మినట్లు ఫిర్యాదులు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు అమ్మాలన్నారు. మండలంలోని రైతులు స్థానికంగా ఉండే ఏఈవో సలహా తీసుకుని మంచి విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో గణేష్రెడ్డి పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దామరగిద్ద : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏవో ప్రదీప్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంతో పాటు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్ రికార్డులను పరిశీలించారు. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల విక్రయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ పాస్ మిషన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. లూజ్ విత్తనాలు విక్రయించరాదని హెచ్చరించారు.