ఆరు గ్యారంటీలకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:14 PM
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు
మెదక్, ఏప్రిల్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరుగ్యారంటీలకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు తరఫున గురువారం ఎమ్మెల్యే నామినేషన్ వేసిన అనంతరం మెదక్ మండలం మాచవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో దివంగత ప్రధాని ఇందిరమ్మ ప్రాతినిథ్యం వహించిన మెదక్ ప్రాంతం కాంగ్రె్సకు కంచుకోట అని చెప్పారు. నీలం మధు అత్యధిక మెజార్టీతో గెలుపొందనున్నారని, ఇందుకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణనే నిలువెత్తు తార్కాణమన్నారు. ఈ నెల 20న నీలంమధు మరో సెట్ నామినేషన్ వేస్తారని, ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామారెడ్డి కలెక్టర్గా ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, రంగనాయక్ సాగర్ ప్రాజక్టు ముంపు బాధితులకు పరిహారం ఇవ్వడంలో చేసిన నిర్లక్ష్యం ఆయనను ఓటమిపాలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఓటమి ఆమె స్వయంకృతాపరాధమేనన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు బొజ్జ పవన్, పరశురాం, తాహెర్, అహ్మద్, సిద్దార్థ, శ్రీనివా్సచౌదరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.