Share News

పింఛన్‌ రూ.4వేలు ఇవ్వని రేవంత్‌... రూ.4 లక్షల జీతం తీసుకుంటుండు

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:16 PM

గజ్వేల్‌, ఏప్రిల్‌ 15: డిసెంబరు 9 నుంచి అవ్వ, తాతలకు రూ.4వేల పింఛన్‌ ఇస్తానని చెప్పిన రేవంత్‌ ప్రజలకు శఠగోపం పెట్టారని, ఆయన మాత్రం రూ.4 లక్షల జీతాన్ని తీసుకుంటున్నారని బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు.

పింఛన్‌ రూ.4వేలు ఇవ్వని రేవంత్‌... రూ.4 లక్షల జీతం తీసుకుంటుండు
గజ్వేల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో రఘునందన్‌రావు

నాలుగు నెలల్లో ప్రజలకు శఠగోపం పెట్టాడు

400 సీట్లలో మెదక్‌ పార్లమెంట్‌ సీటు ఉండాలి

బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు

గజ్వేల్‌, ఏప్రిల్‌ 15: డిసెంబరు 9 నుంచి అవ్వ, తాతలకు రూ.4వేల పింఛన్‌ ఇస్తానని చెప్పిన రేవంత్‌ ప్రజలకు శఠగోపం పెట్టారని, ఆయన మాత్రం రూ.4 లక్షల జీతాన్ని తీసుకుంటున్నారని బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఆయన సోమవారం రోడ్‌షోను నిర్వహించి మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి నాలుగు నెలల్లో ప్రజలకు నీళ్లు, కరెంట్‌, పింఛన్‌ ఇవ్వడం లేదని, డిసెంబరు 9న రూ.2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఢిల్లీకి తిరుగుతున్నాడు కానీ, రుణమాఫీ చేయడం లేదన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపాలన్న ఉద్దేశంతోనే ప్రజలు రేవంత్‌రెడ్డికి ఓటు వేశారని, ఇక ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్‌ ఏనాడైనా గజ్వేల్‌ ప్రజలకు కలిశారా అని ప్రశ్నించారు. గజ్వేల్‌ పట్టణంలో నిరుపేదలకు ఇస్తానన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఇంట్లో 30 బెడ్‌రూం ఇళ్లు ఉన్నాయని చెబుతున్నారని, కానీ ఇక్కడ గరీబోళ్లకు మాత్రం ఇవ్వలేదన్నారు. 400 సీట్లతో మూడోసారి మోదీ ప్రధాని కానున్నాడని, 400 సీట్లలో మెదక్‌ ఉండాలని కోరారు. సీనియర్‌ నాయకులు జశ్వంత్‌రెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, సింగం సత్తయ్య, నందన్‌గౌడ్‌, ఎల్కంటి సురేశ్‌, కమ్మరి శ్రీనివాస్‌, మహేశ్‌, నేమూరి ఆంజనేయులుగౌడ్‌, నత్తి శివకుమార్‌ ఉన్నారు.

వెంకట్రామ్‌రెడ్డిపై కేసెందుకు పెట్టలేదు..

తూప్రాన్‌, ఏప్రిల్‌ 15: అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బులు రవాణా చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మెదక్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డిపై ఎందుకు కేసు పెట్టడం లేదని, అరెస్టు చేయడం లేదని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ప్రశ్నించారు. తూప్రాన్‌ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లినట్లు తాను ఆరోపించడం లేదని, రాధాకిషన్‌రావే చెప్పారని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి వియ్యంకుడు కావడం వల్ల.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పైరవీతో వెంకట్రామారెడ్డిని కాపాడుతున్నారా అని ప్రశ్నించారు.

Updated Date - Apr 15 , 2024 | 11:16 PM