తప్పుడు కూతలు కూస్తున్న వారిని చట్టపరంగా శిక్షిస్తాం
ABN , Publish Date - Apr 14 , 2024 | 11:32 PM
వర్గల్, ఏప్రిల్ 14: రాజకీయ లబ్ధికోసం తనపై తప్పుడు కూతలు కూస్తున్న వారిని వదిలే ప్రసక్తి లేదని, వారిని చట్టపరంగా శిక్షిస్తామని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి అన్నారు.
రఘునందన్ ఘన చరిత్ర ఏంటో అందరికీ తెలుసు
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి
వర్గల్, ఏప్రిల్ 14: రాజకీయ లబ్ధికోసం తనపై తప్పుడు కూతలు కూస్తున్న వారిని వదిలే ప్రసక్తి లేదని, వారిని చట్టపరంగా శిక్షిస్తామని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం గౌరారంలో పార్టీ మండలాధ్యక్షుడు వేలూరి వెంకట్రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ కొందరు రాజకీయ లబ్ధికోసం తనను తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, వారికి భయపడే వ్యక్తిని కాదన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఉడుత ఊపులకు భయపడేది లేదని, రఘనందన్ ఘన చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో వంద అబద్దాలు ఆడిన రఘునందన్ను దుబ్బాక ఓటర్లు 54 వేల ఓట్ల తేడాతో ఓడించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే తనపై కలెక్టర్, ఎస్పీకి, ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే తాను బరిలో ఉన్నానని, విజయం బీఆర్ఎ్సదేనన్నారు. అనంతరం రాష్ట్ర ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎంపీపీ లతారమేశ్గౌడ్, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, జడ్పీటీసీ బాలుయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.
మెదక్ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా
తూప్రాన్, ఏప్రిల్ 14: మెదక్ గడ్డ అంటేనే గులాబీ (బీఆర్ఎస్) అడ్డా అని, మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తూప్రాన్ పట్టణంలో బస్వన్నగారి సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన తూప్రాన్ పట్టణ, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 50 ఏళ్ల ముందుకు పోయిందన్నారు. తనకు మాయ మాటలు రావని, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కలెక్టర్గా ఖ్యాతి ఇచ్చిన ఈ (మెదక్) గడ్డే నాకు రాజకీయ జీవితం కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. కలెక్టర్గా పరిపాలనా అనుభవంతో మీ సమస్యలను సులువుగా పరిష్కరిస్తానని హామీఇచ్చారు. జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి, టీఎస్ ఎంఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాఘవేందర్గౌడ్ ప్రసంగించారు.
కలెక్టర్గా ఆదరించారు.. ఎంపీగా ఆశీర్వదించండి
జగదేవ్పూర్, ఏప్రిల్ 14: కలెక్టర్గా ఇక్కడికి వందసార్లు వచ్చానని, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి కోరారు. ఆదివారం జగదేవ్పూర్లో జరిగిన జగదేవ్పూర్, మర్కుక్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతా్పరెడ్డితో కలిసి మాట్లాడారు. అబద్ధపు హామీలు, మాయమాటలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డికి ఓటేస్తే ట్రస్టు ఏర్పాటు చేసి ఆదుకుంటాడని గ్రామగ్రామాన చాటి చెప్పాలన్నారు. అనంతరం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతా్పరెడ్డి మాట్లాడారు. ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మంగమ్మ రాంచంద్రం, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.