రూ.20వేలకు బదులు రూ.1.25లక్షల బిల్లు
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:22 AM
విద్యుత్ మీటర్ రీడింగ్ సిబ్బంది నిర్వాకంతో రూ.1లక్షకు పైగా బిల్లు రావడంతో ఏఎంసీ అధికారులు బిత్తరపోయారు. తప్పుడు బిల్లును సరి చేసేందుకు కూడా బ్యాంక్ డీడీ తీసి దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్కో అధికారులు నిబంధన విధించడం గమనార్హం.
విద్యుత్ రీడింగ్ సిబ్బంది నిర్వాకంతో తప్పిదం
చౌటుప్పల్ టౌన్, ఏప్రిల్ 15: విద్యుత్ మీటర్ రీడింగ్ సిబ్బంది నిర్వాకంతో రూ.1లక్షకు పైగా బిల్లు రావడంతో ఏఎంసీ అధికారులు బిత్తరపోయారు. తప్పుడు బిల్లును సరి చేసేందుకు కూడా బ్యాంక్ డీడీ తీసి దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్కో అధికారులు నిబంధన విధించడం గమనార్హం. చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి విద్యుత్ బిల్లు రూ.1,25,440 వచ్చింది. సాధారణంగా నెలకు రూ.20,000కు అటు ఇటుగా బిల్లు వస్తుంది. అదే ధాన్యం తూకాల సీజన్లో నెలలకు రూ.25,000 చొప్పున విద్యుత్ బిల్లు వస్తుంది. కానీ, ధాన్యం తూకాలు ప్రారంభం కాకముందే రూ.1,25,440 బిల్లు రావడంతో ఏఎంసీ అధికారులు బిత్తరపోయారు. ఈ నెల 3వ తేదీన మీటర్ రీడింగ్ తీయగా, ఈ బిల్లును సరి చేయాలని ట్రాన్స్కో అధికారులను ఏఎంసీ కార్యదర్శి రవీందర్రెడ్డి కోరారు. అయితే డీడీ తీసి దరఖాస్తు చేయాలని ట్రాన్స్కో అధికారులు సూచించారు. అయితే ప్రీపెయిడ్ మీటర్ కావడంతో విద్యుత్ సరఫరా ఏ క్షణంలోనైనా నిలిచే ప్రమాదం ఉందని, దీంతో మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఏఎంసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ట్రాన్స్ కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం : రవీందర్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి
విద్యుత్ బిల్లు రీడింగ్లో జరిగిన తప్పిదాన్ని ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఏ ఎంసీ మీటర్ ప్రీపెయిడ్ కావడంతో ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పక్షం లో మార్కెట్ యార్డులో ఇబ్బందులు తలెత్తుతా యి. నెలకు రూ.20వేల నుంచి రూ.25వేల మధ్య వచ్చే విద్యుత్ బిల్లు ఒక్క సారిగా రూ. 1.25లక్షలు రావడంతో దిగ్ర్భాంతి చెందాం.
పొరపాటును సవరించాలని దరఖాస్తు చేశారు : సతీష్, విద్యుత్శాఖ ఏఈ
చౌటుప్పల్లోని ఏఎంసీ మీటర్ బిల్లు రీడింగ్లో జరిగిన పొరపాటును సవరించాలని సంబంధిత అధికారులు దరఖాస్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తాం.