Share News

ప్రజాభిప్రాయ సేకరణపై ఉత్కంఠ

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:37 AM

రామన్నపేట సమీపంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుపై కాలుష్య నియంత్రణమండలి ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధమైంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రామన్నపేట మండలవాసులతోపాటు నల్లగొండ జిల్లా చిట్యాల మండల ప్రజలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణపై ఉత్కంఠ

63.8 ఎకరాల్లో రూ.1,400కోట్లతో అంబుజా సిమెంట్‌ పరిశ్రమకు ప్రతిపాదన

నేడు ప్రజాభిప్రాయ సేకరణ

ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం

వ్యతిరేకిస్తున్న పార్టీలు, ప్రజాసంఘాలు

వెల్లువెత్తుతున్న నిరసనలు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రామన్నపేట సమీపంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుపై కాలుష్య నియంత్రణమండలి ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధమైంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రామన్నపేట మండలవాసులతోపాటు నల్లగొండ జిల్లా చిట్యాల మండల ప్రజలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజా సంఘాలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేగాక ప్రజాభిప్రాయ సేకరణపై ప్రజలను వారం రోజులుగా చైతన్యం చేస్తూ పార్టీల నేతలు పలు కార్యాక్రమాలు నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలపాలని పిలుపునివ్వడంతో ఈ మేరకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణపై ఉత్కంఠ నెలకొంది.

గతంలో రామన్నపేట సమీపంలో డ్రైపోర్టు ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం రైతుల నుంచి 360ఎకరా ల భూమిని సేకరించింది. ఆ భూమిలో 63.8 ఎకరా ల్లో ఏడాదిలో 6.0మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామ ర్ధ్యం గల సిమెంట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అంబుజా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలో అంబుజా సి మెంట్‌ పరిశ్రమ ప్రతిపాదిత స్థలం వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ స మావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్థానిక ప్రజలు, రైతులు నుంచి అధికారులు అభిప్రాయాలను సేకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహజ వనరులు ఏమైనా దెబ్బతింటాయా? నీరు, అడవులు, పంటలకు కాలుష్య ముప్పు ఉంటుందా? అనే అంశాలపై ప్రజ లు, శాస్త్రవేత్తలు, మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ తరువాత అధికారులు, ప్రజల అభిప్రాయం మేరకు సిమెంట్‌ ఫ్యాక్టరీని నెలకొల్పాలా? లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌, జడ్పీ సీఈవో పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అడవు లు, వాతావరణశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ.. మండలి అధికారులు హాజరుకానున్నారు.

పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళనలు

రామన్నపేటలో ఏర్పాటుచేయనున్న అంబుజ సిమెంట్‌ ఫ్యాక్టరీతో గాలి, నీటి వనరులు, వ్యవసాయ భూములకు హాని చేకూరుతుందని స్థానికులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రంలో పలు పార్టీలు, ప్రజాసంఘాల ఆఽధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పరిశ్రమ ఏర్పాటుతో రామన్నపేట చుట్టూ ఉన్న 10 గ్రా మాలకు వాతావరణ కాలుష్య ముప్పు ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిశ్రమ ఏర్పాటును వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కట్టుదిట్ట భద్రత

సిమెంట్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తూ పలు పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బుధవారం రామన్నపేటలో చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్ట ఏర్పాట్లు చేసింది. ప్రజలంతా తమ... అభిప్రాయాలను చెప్పేలా, సభలో ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ వేదికను మంగళవారం పరిశీలించారు. రామన్నపేటతోపాటు పలు గ్రామాల ప్రజలు ఇక్కడి రానున్నండటంతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా, నిరసనలు శాంతియుతంగా తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే స్థానికులతోపాటు పలు పార్టీల నేతలు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలను పెద్దసంఖ్యలో మోహరించే అవకాశం ఉంది.

ప్రజలకు హాని కలిగించే ఫ్యాక్టరీ వద్దు: సాల్వేరు అశోక్‌, మాజీ ఎంపీటీసీ, రామన్నపేట

ప్రజలకు హాని కలిగించే అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీని తక్షణమే నిలిపివేయాలి. ప్రభుత్వం చొరవతీసుకొని సిమెంట్‌ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వవద్దు. ప్రజాభిప్రాయ సేకరణలో ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రతీ ఒక్కరు వ్యతిరేకించాలి. ప్రాణాలకు ముప్పు తెచ్చే ఫ్యాక్టరీని నిర్మించొద్దు.

పర్యావరణాన్ని కలుషితం చేసే ఫ్యాక్టరీ : అశోక్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు.

వ్యవసాయంపై జీవనం గడుపుతున్న రైతాంగాన్ని అంబుజా ప్రతినిధులు మోసం చేసి, పచ్చని పంట పొలాలను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో హాని కలిగించే సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం దారుణం. పర్యావరణాన్ని కలుషితం చేసే ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతాం.

Updated Date - Oct 23 , 2024 | 12:37 AM