పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:28 AM
పేదలకు ఇళ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లు ఇచ్చే వరకు పాలకులపై పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు
భువనగిరి రూరల్, జూలై 26: పేదలకు ఇళ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లు ఇచ్చే వరకు పాలకులపై పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గాను శుక్రవారం భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గోద శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నివాస స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామన్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. భువనగిరి శివారులోని సింగన్నగూడెంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్బెడ్ ఇళ్లు కేటాయించాలన్నారు. హన్మాపురం, బొమ్మాయిపల్లి గ్రామాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు స్థలాలు ఇవ్వాలన్నారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు బండి జంగమ్మ, చెక్క వెంకటేశ, సోమన సబిత, పుట్ట రమేశ, వస్తావుల అభిలాష్, చింతల మల్లేశ, రాఘవులు, పెంటయ్య, భిక్షపతి, దాసరి లక్ష్మయ్య, వెంకట్రెడ్డి, యాదగిరి, అనిల్, రాంబాబు, సత్తయ్య ఉన్నారు.