పైసలిస్తేనే పనులు
ABN , Publish Date - May 29 , 2024 | 12:21 AM
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లదే హవా నడుస్తుంది. సంబంధిత శాఖలో ఉద్యోగుల కొరత ఉండటం ఒక కారణం కాగా, వాహనదారులు దరఖాస్తు చేసుకుని లైసెన్స్లు, ఆర్సీలు, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం పదేపదే తిరగడం ఎందుకని ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల దందా
నల్లగొండలో ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన ఇద్దరు ఉద్యోగులు
నాలుగు నెలల క్రితం ఏసీబీకి చిక్కిన యాదాద్రి డీటీవో
సరిహద్దు చెక్పోస్టుల్లో వసూళ్ల పర్వం
నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి రూరల్, కోదాడ: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లదే హవా నడుస్తుంది. సంబంధిత శాఖలో ఉద్యోగుల కొరత ఉండటం ఒక కారణం కాగా, వాహనదారులు దరఖాస్తు చేసుకుని లైసెన్స్లు, ఆర్సీలు, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం పదేపదే తిరగడం ఎందుకని ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ(డీటీవో) కార్యాలయంలోనే నల్లగొండ ఆర్టీఏ కార్యాల యం ఉంది. ఈ కార్యాలయం ఎదుట దుకాణాలు ఏర్పాటుచేసుకున్న కొందరు ఆర్టీఏ ఏజెంట్లుగా అనధికారికంగా కొనసాగుతున్నారు. వారు వెళ్తేనే కార్యాలయాల్లో పనులు జరుగుతుండటంతో వారి హవాకు అడ్డు లేకుండాపోయింది. తాజాగా నల్లగొండ డీటీ వో కార్యాలయంలో ఏసీబీ సోదాలతో ఆర్టీఏ ఏజెంట్ల దందాపై చర్చ సాగుతోంది.
ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వాహనదారుల నుం చి ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. ఏ ధ్రువీకరణ పత్రానికి ఎంత ఫీజు చెల్లించాలనేది వాహనదారులకు సైతం తెలియడం లేదు. అధికారులు అవగాహన కల్పించకపోవడంతో ఏజెంట్లను ఆశ్రయించి వాహనదారులు నష్టపోతున్నారు. ఆర్సీలు, లైసెన్స్లు, వెహికల్ ట్రాన్స్ఫర్, ఇతర సర్టిఫికెట్ల కోసం పెద్ద మొత్తంలో ఏజెంట్లకు వాహనదారు లు చెల్లిస్తున్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలోనూ అధికారు లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జూన్లో పాఠశాలల ప్రారంభం నాటికే స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాకే నడపాలి. కానీ, దీన్ని యజమానులు పట్టించుకోవడం లేదు.
ఇద్దరు ఉద్యోగులు నల్లగొండలో తిష్ఠ
నల్లగొండ ఆర్టీఏ కార్యాలయంలో ఇద్దరు సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. వారు సమయానికి కార్యాలయానికి రాకుండా, ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. రాజకీయ పార్టీల నేతలో సంబంధాలు కొనసాగిస్తూ ఆర్టీఏ కా ర్యాలయ ఉద్యోగులపై, అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నట్టు తెలిసింది. మిర్యాలగూడ ఆర్టీవో కార్యాలయానికి మిర్యాలగూడ, దేవరకొం డ డివిజన్ల నుంచి వాహనాల పర్మిట్లు, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోం వస్తుంటారు. కాగా, ఇక్కడ సుమారు 150 మందికి పైగా ఆర్టీఏ ఏజెంట్లు అనధికారికంగా కార్యాలయంలో దందా సాగిస్తున్నా రు. ఇక్కడా ఏజెంట్ల ద్వారా వెళ్తేనే కార్యాలయంలో పనులు అవుతున్నాయి. కోదాడ ఆర్టీవో కార్యాలయంలో లారీ రిజిస్ట్రేషన్కు రూ.5,000, ఫిట్నెస్కు రూ.4,000ఇవ్వాల్సి వస్తోందని యజమానులు చెబుతున్నారు.
ఏసీబీకి పట్టుబడినా మారని తీరు
యాదాద్రి జిల్లాలో డీటీవోతోపాటు మరో ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పర్మిట్ కోసం మీ-సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా కార్యాలయానికి వస్తే వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. ఏజెంట్లు, దళారుల ద్వారా వచ్చినవారి పనులు మాత్రం వెంటనే అవుతున్నాయి. దీంతో అనివార్యంగా వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయించక తప్పడం లేదు. నాలుగు నెలల క్రితం రూ.5వేలు లంచం తీసుకుంటూ డీటీవో ఏసీబీకి చిక్కారు. నేషనల్ పర్మిట్ రద్దు చేసేందుకు లారీ యజమాని నుంచి రూ.5వేలు లంచం తీసుకున్న జిల్లా రవాణాధికారి సురేందర్రెడ్డి ఏసీబీకి దొరికారు. అయినా ఆర్టీఏ కార్యాలయాల అధికారుల తీరు మాత్రం మారలేదు.
చేయి తడిపి ‘హద్దులు’ దాటుతున్నారు
ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత సరుకులు, అధిక లోడుతో వచ్చే వాహనాలను అడ్డుకోవాల్సిన అధికారులు చేయి తడిపితే అన్నింటికీ రైట్ చెబుతున్నారు. నల్లగొండ జిల్లా వాడపల్లి చెక్పోస్ట్ వద్ద అధికారులు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటుచేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. గతంలో వాడపల్లిలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి తన వాహనంలో అక్రమంగా మద్యాన్ని ఏపీ రాష్ట్రానికి సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి చెక్పోస్ట్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు ప్రతీ లారీని నిలిపి ఆర్సీ, వేబిల్లు పత్రాలతో పనిలేకుండా రూ.200 ముట్ట చెబితే కనీసం లారీలో ఏ సరుకు రవాణా అవుతుం దో చూడకుండానే వదిలివేస్తారని డ్రైవర్లు బహాటంగా చర్చించుకుంటున్నారు. అదనపు లోడుతో వచ్చే 10టైర్ల లారీలకు రూ.200, 12 టైర్ల లారీలకు రూ. 500నుంచి రూ.700 వరకు ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నతస్థాయి అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం సదరు ప్రైవేట్ వ్యక్తులు సైలెంట్గా తప్పుకుంటున్నట్టు సమాచారం. ఇక చెక్పోస్టుల వద్దకు పీడీఎస్ బియ్యం, గుట్కా, పొగాకు ఉత్పత్తుల వాహనాలు వస్తే వారికి పండుగే. పంట నూర్పిడి సమయంలో ఏపీ రాష్ట్రం నుంచి వ్యాపారులు లారీల్లో మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు తరలించే ధాన్యపు లోడ్లకు రూ.500 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నట్టు, ఓవర్లోడ్తో అయితే మరికొంత అదనంగా వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక తనిఖీల సమయంలో తప్ప రోజుల్లో అన్ని వాహనాలకు కరెన్సీ నోటుతో రవాణాకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిత్యం రూ.4లక్షలకుపైగా వసూలు
కోదాడ మండలం రాష్ట్ర సరిహద్దు చిమిర్యాల వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ రవాణా అధికారులు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అన్ని పత్రాలు ఉన్నా రూ.300 ఇస్తేనే లారీని సరిహద్దు దాటిస్తున్నారు. లేదంటే బ్యాక్ డోర్ లేదని, అదనపు టన్నులు ఉన్నాయని, డబుల్ డ్రైవర్ లేరని, యూనిఫాం లేదని అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని డ్రైవర్లు పేర్కొంటున్నారు. చిమిర్యాల చెక్పోస్ట్ నుంచి నిత్యం 1500 సరుకు రవాణా లారీలు వెళ్తుంటాయి. ఇక్కడ నిత్యం రూ.4లక్షలకు పైగా మూమూళ్ల రూపంలో వసూలు చేస్తున్నట్టు తెలిసింది.