Share News

Tummala : 4 లక్షల మందికి దీపావళిలోపు రుణమాఫీ

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:13 AM

రూ. 2 లక్షల రుణాలున్న నాలుగు లక్షల మంది రైతులకు దీపావళి లోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు.

Tummala : 4 లక్షల మందికి దీపావళిలోపు రుణమాఫీ

  • సీజన్‌కు రూ.7,500 ‘రైతు భరోసా’

  • ఈ ఏడాది నుంచే రైతు పంటల బీమా

  • ఏ పంటకైనా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది: మంత్రి తుమ్మల

  • రూ.2లక్షల రుణాలున్న రైతులకూ లబ్ధి

  • పంట కాలానికి 7,500 ‘రైతు భరోసా’

  • ఈ ఏడాది నుంచే పంట బీమా: తుమ్మల

నల్లగొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రూ. 2 లక్షల రుణాలున్న నాలుగు లక్షల మంది రైతులకు దీపావళి లోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. బుధవారం నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్‌తో కలిసి తుమ్మల పర్యటించారు. నల్లగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రూ. 36 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిడమనూరు, హాలియా మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామని తుమ్మల చెప్పారు. 22 లక్షల రేషన్‌ కార్డులున్న రైతులకు ఇది వరకే రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామని, కార్డులు లేని 4 లక్షల మంది రైతులకు ఈ నెలాఖరుకు వారి ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని తెలిపారు.


రూ.2లక్షల పైన రుణాలున్న రైతులకు కూడా రుణాలు మాఫీ చేసేందుకు షెడ్యూల్‌ ప్రకటిస్తామని చెప్పారు. ఈ పంట కాలంలోనే రూ.31వేల కోట్ల రుణమాఫీని చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతోపాటు పంట కాలానికి రూ.7,500 ‘రైతు భరోసా’ ఇచ్చేందుకు నిర్ణయించామని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు. పంటలబీమా పథకాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తుమ్మల ప్రకటించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై చర్చించాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదా..? అని నిలదీశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 17 , 2024 | 03:13 AM