Share News

TS News: తేజూ.. నీ దగ్గరికి వస్తున్నానంటూ యువకుడి బలవన్మరణం.. ఈ కథలో ట్విస్ట్‌లెన్నో..

ABN , Publish Date - Aug 13 , 2024 | 01:27 PM

ఏది నిజం.. ఏది అబద్ధం అనేది కొన్ని విషయాల్లో అర్థం కాదు. అలాంటిదే ఇది. ఈ రియల్ స్టోరీ చాలా ట్విస్టులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి ప్రేమ వేధింపుల కారణంగా బీఫార్మసీ చదువుతున్న తేజు అనే యువతి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

TS News: తేజూ.. నీ దగ్గరికి వస్తున్నానంటూ యువకుడి బలవన్మరణం.. ఈ కథలో ట్విస్ట్‌లెన్నో..

హైదరాబాద్: ఏది నిజం.. ఏది అబద్ధం అనేది కొన్ని విషయాల్లో బయటపడదు. అలాంటిదే ఘటనే ఇది. ఈ రియల్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడడంతో బీఫార్మసీ చదువుతున్న తేజు అనే యువతి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెను వేధించాడని అంటున్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ లేఖలో తామిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నామని పేర్కొన్నాడు. తమ చావులకు ఎవరో బీజేపీ నాయకుడు కారణమని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని లేఖలో వేడుకున్నాడు.


శ్రీహరి సూసైడ్ లెటర్‌లో ఏముందంటే..

‘‘తేజూ.. నేను నీ దగ్గరికి వస్తున్నా ... నేను చనిపోయాక అందరికీ నిజం తెలుస్తుంది. 7వ తేదీన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నాది వన్ సైడ్ లవ్ కాదు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే తేజు లేనిదే శ్రీ లేడు. శ్రీ లేనిదే తేజు లేదు. తేజు చనిపోవడానికి బీజేపీ నాయకుడు రాజు రెడ్డి, తేజు వాళ్ల నాన్న, అన్నలే కారణం. మా ఆత్మలకు శాంతి కలగాలంటే వారిని అస్సలు వదలొద్దు. కఠినంగా శిక్షించండి. నా తేజు నా కోసం పైన ఎదురు చూస్తూ ఉంటుంది. నేను చనిపోయాక మన ఫొటోలు బయటకు వస్తాయి. అప్పుడు మీడియా వాళ్లే నాకు హెల్ప్ చేయాలి. నా ఫ్రెండ్స్, అన్నలు అందరూ నా కోసం ఫైట్ చేయండి. ఇదే నా కోరిక. అక్క నువ్వే అమ్మను జాగ్రత్తగా, నేను లేని లోటు లేకుండా చూసుకో’’ అని శ్రీహరి పేర్కొన్నాడు.


పొంతన లేని కథనాలు..

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీహరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాథమిక దర్యాప్తులో ఇన్‌స్టా‌గ్రామ్‌లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడిందని, అందుకు శ్రీహరి కారకుడని పోలీసులు గుర్తించారు. తేజస్విని ఆత్మహత్యానంతరం శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత సూరారం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దుండిగల్ బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరి వేసుకొని శ్రీహరి ఆత్మహత్య చేసున్నాడు.

అయితే శ్రీహరి చెబుతున్న కథనం ఒకలా.. తేజస్విని తరుఫు వారు చెబుతున్న కథనం మరోలా ఉంది. శ్రీహరి ప్రేమ వేధింపులు భరించలేకే తేజు ఆత్మహత్య చేసుకుందని ముందుగా కథనాలు వచ్చాయి. కానీ శ్రీహరి మాత్రం తామిద్దరం ప్రేమించుకున్నామని ఈ నెల 7న వివాహం కూడా చేసుకుందామనుకున్నామని చెబుతున్నాడు.


అసలు అంతకు ముందు ఏం జరిగిందంటే..

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన దోమడుగు గ్రామానికి చెందిన రాజు, సోనీ దంపతుల కుమార్తె తేజస్విని(20). బీఫార్మసీ సెకండియర్‌ చదువుతున్న తేజస్వినికి అదే గ్రామానికి చెందిన శ్రీహరి కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని శ్రీహరి వేధించడం మొదలుపెట్టాడు. ఇదే విషయమై తేజస్విని కుటుంబసభ్యులను కూడా బెదిరించాడు. దీంతో తేజస్విని ఇంట్లో నాలుగు రోజుల క్రితం కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీహరి వేధింపులు తాళలేకపోయిన తేజస్విని గత గురువారం రాత్రి తమ ఇంటి భవనం మూడో అంతస్తు నుంచి దూకేసింది. రక్తపుమడుగులో పడి ఉన్న తేజస్వినిని కుటుంబసభ్యులు హుటాహుటిన సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించిందంటూ వార్తలు వచ్చాయి

Updated Date - Aug 13 , 2024 | 01:47 PM