Share News

మనీ ల్యాండరింగ్‌ కేసు అంటూ బెదిరింపు

ABN , Publish Date - Sep 23 , 2024 | 05:00 AM

‘‘మేము ముంబై పోలీసులం. మీ పేరు మనీ ల్యాండరింగ్‌ కేసులో ఉంది. మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే మేము చెప్పినంత డబ్బును చెప్పిన అకౌంట్‌కు పంపాలి’’ అని బెదిరిస్తూ.. డబ్బులు కాజేస్తున్న నిందితుడిని గోదావరిఖని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

మనీ ల్యాండరింగ్‌ కేసు అంటూ బెదిరింపు

  • రూ. 1.45 కోట్లు లూటీ.. సైబర్‌ నేరస్థుడి అరెస్టు

కోల్‌సిటీ, సెప్టెంబరు 22: ‘‘మేము ముంబై పోలీసులం. మీ పేరు మనీ ల్యాండరింగ్‌ కేసులో ఉంది. మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే మేము చెప్పినంత డబ్బును చెప్పిన అకౌంట్‌కు పంపాలి’’ అని బెదిరిస్తూ.. డబ్బులు కాజేస్తున్న నిందితుడిని గోదావరిఖని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు మంచిర్యాల జిల్లాలోని ఒక ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకుడికి ఫోన్‌ చేసి బెదిరించగా అతడు భయపడి నిందితుడి అకౌంట్‌కు విడతల వారీగా రూ.1.45 కోట్లు పంపాడు. తర్వాత తాను మోసపోయానని గ్రహించి 1930 నెంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశాడు. గోదావరిఖని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు మహారాష్ట్రలోని వాసిం జిల్లా దేవపేటకు చెందిన సంతోష్‌ శ్రీ కృష్ణగా గుర్తించి.. అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడినిని విచారించగా తాను అసలు నేరస్థుడిని కాదని, తన అకౌంట్‌ను వేరే వ్యక్తి ఆపరేట్‌ చేస్తున్నాడని, తనకు కమిషన్‌ మాత్రమే ఇచ్చేవాడని తెలిపాడు. అతను తన బ్యాంక్‌ అకౌంట్‌ను సైబర్‌ నేరాలకు వాడుకున్నాడని వెల్లడించాడు. ఈ అకౌంట్‌తో పలు రాష్ట్రాల్లో 18 నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేరంలో ఎంత మంది భాగస్వామ్యం ఉంది, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంతో పాటు ఈ కేసు తాలూకా లింకులు విదేశాలలో ఉన్నట్టు తెలుసుకుని ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - Sep 23 , 2024 | 05:00 AM