కూలితేనే పట్టించుకుంటారా?
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:24 AM
జిల్లా కేంద్రంలోని హెడ్పోస్టాఫీస్ సేవలు ప్రారంభమై 110 ఏళ్లవుతోంది. నిజాం కాలంనాటి భవనంలోనే ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ ఏర్పడి, జిల్లా కేంద్రంగా ఆవిష్కృతమైనప్పటికి మానుకోటలో మాత్రం పోస్టాఫీస్ భవనం రూపురేఖలు మారలేదు. శిఽఽథిలావస్థకు చేరుకున్న భవనంలోనే పోస్టీఫీసు ఖాతాదారులకు సేవలందుతున్నాయి. నిజాం కాలంలో 1914 సంవత్సరంలో మానుకోట పాతబజారులోని రైల్వేస్టేషన్ సమీపంలో నిర్మించిన భవనంలో పోస్టాఫీసు సేవలు ప్రారంభమయ్యాయి.
మానుకోట హెడ్పోస్టాఫీస్ భవనానికి 110 ఏళ్లు
నిజాంకాలం నాటి భవనంలో నిర్వహణ
ఎప్పుడు పడిపోతుందోనని భయాందోళన
పార్కింగ్ స్థలం లేక వాహనదారుల అవస్థలు
స్థలం లేక స్కూల్ బిల్డింగ్లో పాస్పోర్టు ఆఫీసు నిర్వహణ
మహబూబాబాద్ టౌన్, ఏప్రిల్ 4 : జిల్లా కేంద్రంలోని హెడ్పోస్టాఫీస్ సేవలు ప్రారంభమై 110 ఏళ్లవుతోంది. నిజాం కాలంనాటి భవనంలోనే ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ ఏర్పడి, జిల్లా కేంద్రంగా ఆవిష్కృతమైనప్పటికి మానుకోటలో మాత్రం పోస్టాఫీస్ భవనం రూపురేఖలు మారలేదు. శిఽఽథిలావస్థకు చేరుకున్న భవనంలోనే పోస్టీఫీసు ఖాతాదారులకు సేవలందుతున్నాయి. నిజాం కాలంలో 1914 సంవత్సరంలో మానుకోట పాతబజారులోని రైల్వేస్టేషన్ సమీపంలో నిర్మించిన భవనంలో పోస్టాఫీసు సేవలు ప్రారంభమయ్యాయి. ఆ నాటి నుంచి నేటి వరకు హెడ్ పోస్టాఫీస్ అందులోనే కొనసాగుతోంది. హెడ్ పోస్టాఫీస్లో ఖాతాదారులకు బ్యాకింగ్, పోస్టల్ సేవల ందుతున్నాయి. గతంలో ఒక్కపోస్టల్ శాఖకు సంబంధించిన సేవలు మాత్రమే ఉండేవి. క్రమక్రమంగా ఖాతాదారులకు మరింత సేవలందించేందుకు పోస్టల్ శాఖ దేశ వ్యాప్తంగా ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ)ను ప్రారంభించారు. దీంతో బ్యాంకు తరహాలోనే పోస్టల్శాఖలో ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. దీంతో రోజు వారీగా హెడ్పోస్టాఫీస్కు వచ్చే ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పనుల నిమ్తితం పెద్ద సంఖ్యలో పోస్టాఫీసుకు వస్తే కూర్చోవడానికి కూడ స్థలం సరిపడా లేదు. 110 ఏళ్లు దాటిన భవనం ఎప్పుడు కూలుతుందోనని ఖాతాదారులు భయంగా భయంగా పనుల నిమిత్తం పోస్టాఫీసుకు వెళ్తున్నారు. గతంలో ఆ భవనం కురుస్తుండగా తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి పోస్టాఫీస్ను నిర్వహిస్తున్నారు.
పార్కింగ్ స్థలం లేక వాహనదారుల ఇక్కట్లు...
పట్టణంలోని హెడ్పోస్టాఫీస్ వద్ద పార్కింగ్ స్థలం లేక పోవడంతో అక్కడకు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దినదినాభివృద్ధి చెంది జిల్లా కేంద్రంగా ఎదిగిన మానుకోటలో ప్రధాన రహదారుల్లో సెంట్రల్ డివైడర్లు నిర్మించారు. ఆక్రమంలోనే రైల్వే స్టేషన్ నుంచి బస్డాండ్కు వెళ్లే మార్గంలో సెంట్రల్ డివైడర్లు నిర్మించడం, రైల్వే స్టేషన్కు సమీపంలో ప్రధాన రహదారిపక్కనే పోస్టాఫీస్ ఉండడంతో అక్కడ వాహనాలు నిలిపితే ఆ మార్గంలో పెద్ద వాహ నాలు వెళ్లలేని ధైన్యస్థితి. దీంతో ఆ రహదారిలో ట్రాఫిక్ సమస్యలు కూడ తలెత్తుతున్నాయి. దీనికి తోడు అక్కడ వాహనాలు నిలిపితే వాటికి పెనాల్టీలు పడుతున్నాయి.. వాహనాన్ని నిలిపి పోస్టాఫీసుకు వెళ్లి వచ్చే సరికి వాహనదారుడు ఫోన్కు పెనాల్టీ మెసేజ్ రావడంతో ఆందోళనకు గురవుతున్నారు.
స్కూల్ బిల్డింగ్లో పాస్పోర్టు కేంద్రం..
పోస్టాపీస్ ఆవరణలోనే ఉండాల్సిన పాస్పోర్టు కేంద్రం ప్రభుత్వ స్కూల్లోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. గతంలో పాస్పోర్టు కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. గత ఐదేళ్ల క్రితం మహబూబాబాద్ పార్లమెంటీ కేంద్రంలో పాస్్పోర్టు మంజూరు కావడంతో పోస్టాఫీస్లో స్థలం లేక పక్కన ఉన్న పాఠశాలలోని ఓ గదిలో ఏర్పాటు చేశారు. పాస్పోర్టు పొందేందుకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఈ కేంద్రానికి వస్తుంటారు. ఒక్క గదిలో నిర్వహించడం, అక్కడ కూడ పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పోస్టాఫీస్కు నూతన భవనాన్ని నిర్మించాలి : బోనగిరి రవీంద్రగుప్తా, సీనియర్ సిటిజన్, మానుకోట
మహబూబాబాద్ పట్టణంలో హెడ్ పోస్టాఫీస్కు నూతన భవనాన్ని నిర్మించాలి. నిజాం కాలం నాటి శిధిలావస్థకు చేరుకున్న భవనంలో పోస్టాఫీస్ నిర్వహణ జరుగుతుంది. తాత్కాలిక మరమ్మతు చేస్తూ నిర్వహిస్తున్నారు. అన్ని హంగులతో నూతన భవనాన్ని నిర్మించాలి. అదే విధంగా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పాస్పోర్టు కేంద్రానికి కూడ నూతన భవనం నిర్మించాలి.