Share News

సంప‘పత్తి’కి ఎసరు!

ABN , Publish Date - Sep 27 , 2024 | 11:55 PM

వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి. రైతన్న లకు సంపత్తి తెచ్చిపెట్టేది కాబట్టి దీన్ని తెల్లబంగారం కూడా అంటారు. అయి తే.. ఈ పంటకు ఇప్పుడు విపత్తు వచ్చింది. భారీ వర్షాలు ఏకదాటిగా కురవడంతో దీన్ని పండించే వారికి కంటతడే మిగిలింది. పత్తి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉండగా ప్రకృతి వైపరీత్యాల కారణం గా ఈ ఏడాది భూపాలపల్లి జిల్లా రైతులు నష్టాలనే చవిచూడాల్సి వస్తోంది.

సంప‘పత్తి’కి ఎసరు!
ఎర్రబారిపోయి ఎదగని పత్తి మొక్కలు

కంటతడి మిగిల్చిన అతివృష్టి, అనావృష్టి

వర్షాలతో చేతికందని ‘తెల్లబంగారం’

సస్యరక్షణ చర్యలు పాటించకుండా చేసిన వానలు

భూపాలపల్లి జిల్లాలో సుమారు రూ.50కోట్ల నష్టం!

కాటారం, సెప్టెంబరు 27: భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పత్తి సాగు అయింది. 92,759 ఎకరాల్లో రైతులు దీన్ని పండించారు. ఒక్క కాటారం సబ్‌డివిజన్‌ పరిధిలోని కాటారం, మహాము త్తారం, మల్హర్‌, మహదేవపూర్‌, పలిమెల మండలా ల్లో 36వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలో అడపదడపా కురిసిన వర్షాలతో జూన్‌లోనే రైతులు పత్తి గింజలు విత్తుకున్నారు. వీరిలో వందలాది మంది విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో వారు మళ్లీ మళ్లీ ప్రయత్నించారు. రెండు, మూడుసార్లు విత్తుకున్నారు. దీంతో ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. జూలైలో జిల్లా లోని పలు మండలాల్లో వానలు దంచికొట్టడంతో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. దీంతో పత్తి పంటలు కోలుకొనే పరి స్థితి లేకుండా పోయింది. ఆగస్టు, సెప్టెం బరు మొదటి, రెండో వారంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కుండపోతగా వర్షం పడటం తో పత్తి పంటలో ఎదుగుదల నిలిచిపో యింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లింది.

సస్యరక్షణ చేయలేక..

పత్తి పంటలో కలుపు నివారణ, సస్యరక్షణ చర్యలు సకాలంలో నిర్వహించి పోషక ఎరువులను అందిస్తేనే పత్తిపంట నిజంగా తెల్లబంగారమే. అయితే.. ఈ ఏడా ది పత్తి పంట ఎదిగే దశలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో గడ్డి బాగా పెరిగి కలుపు నివారణ సాధ్యం కాలేదు. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో చీడపీడల కారణంగా పత్తి పంటకు ఎదుగుదల లేకుండా పోయింది.

నల్లరేగడి నేలల్లో ఇబ్బందులు

పత్తి పంట సాధారణ పరిస్థితుల్లోనైతే నల్లరేగడి నేలల్లోనే అధిక దిగుబడులు ఇస్తుంది. మంచి యా జమాన్య పద్ధతులు పాటిస్తే లాభాల పంటే. నల్లరే గడి నేలల్లో తేమశాతం ఎక్కువగా ఉంటే మాత్రం పత్తి పంట ఎదుగుదలలో ప్రభావం చూపుతుంది. ఈ సీజన్‌లో భారీ వర్షాలతో నల్లరేగడి నేలలు నీటిని ఎక్కువగా పీల్చుకోవడంతో పత్తి పంట ఎదగని పరిస్థి తి తలెత్తింది. వేలాది ఎకరాల్లో పత్తి పంటకు ఎడతెగ ని వర్షాలతో ఓ వైపు ఎర్రబారి పోయింది. మరోవైపు కలుపు సమస్య తీవ్రమై దిగుబడులు సరిగా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదనతో ఆందోళన చెందు తున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించి, వాతావరణం అనుకూలిస్తే పత్తి చౌక నేలల్లో 7-9 క్వింటాళ్లు, నల్లరేగడి నేలల్లో 10-15 క్వింటాళ్లు దిగు బడులు వస్తాయి. ఈ ఏడాది అతివృష్టి, అనావృష్టి పరిస్థితిలో దెబ్బతిన్న చేలల్లో ఎకరాకు 3-4 క్వింటాళ్లు కూడా దిగుబడులు రాలేదు. దీంతో పెట్టుబడులు కూడా వెళ్లవని రైతులు నైరాశ్యాన్ని వ్యక్తం చేస్తున్నా రు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చౌక నేలల్లో పత్తి పం ట బాగానే ఎదిగింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో సుమారు 15వేల ఎకరాల్లో పత్తి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. భారీ వర్షాలకు పత్తి పంట నష్టంతో రైతులు దాదాపు రూ.50కోట్లు ఆదాయం కోల్పోనున్నారు. పత్తి పంట పూర్తిగా దెబ్బతిని ఎకరాకు 1-5క్వింటాళ్ల దిగుబడు లు రాక పెట్టుబడులు వెళ్లని రైతులను ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 11:55 PM