Minister TG Bharat: అనకాపల్లిలో మిట్టల్ నిప్పాన్ స్టీల్ప్లాంట్
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:17 AM
దేశంలోనే ఉత్పత్తి పరంగా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో దాదాపు రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో మిట్టల్ నిప్పాన్ కంపెనీ స్టీల్ ప్లాంట్

1,47,162 కోట్లతో రెండు దశల్లో ఏర్పాటు
దేశంలోనే అత్యధికంగా17.8 మి. టన్నుల లక్ష్యం
దాదాపు లక్ష ఉద్యోగాలు అసెంబ్లీలో మంత్రి భరత్
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఉత్పత్తి పరంగా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో దాదాపు రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో మిట్టల్ నిప్పాన్ కంపెనీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. రెండు ఫేజ్ల్లో స్టీల్ప్లాంట్ ఏర్పాటు కానుందని చెప్పారు. ఫేజ్-1లో భాగంగా రూ.61,780 కోట్ల పెట్టుబడితో 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని, ఫేజ్-2లో రూ.85,382 కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ను విస్తరిస్తారని చెప్పారు. ప్లాంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 17.8 మిలియన్ టన్నులు ఉంటుందన్నారు. దీనిద్వారా లక్ష మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇప్పటికే 700 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమయ్యామని, ఫేజ్-2 ఏర్పాటుకు మరో 700 ఎకరాలు సేకరిస్తామని వెల్లడించారు. 2028 నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కంపెనీ అధినేతను కోరారని చెప్పారు. కాగా, 20 వేల ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించాలని కొణతాల రామకృష్ణ కోరగా, మంత్రి అంగీకరించారు.