ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్.. ప్రయోగం విజయవంతం..
ABN , Publish Date - Jan 29 , 2025 | 06:56 AM
ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు 6-23 గంటలకు GSLV F-15 రాకెట్ను ప్రయోగించారు. ఇస్రోకి ప్రతిష్ఠాత్మకమైన వందవ ప్రయోగం. ఇది నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం విజయవంతమైంది.

నెల్లూరు: స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని సాధించింది. ఇస్రో తన వందో ప్రయోగాన్ని బుధవారం ఉదయం ప్రయోగించింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు ఉదయం 6-23 గంటలకు GSLV F-15 రాకెట్ని ప్రయోగించింది. రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. ఇస్రో అభివృద్ధి చేసిన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇస్రోకి ఇది వందవ రాకెట్ ప్రయోగం. కాగా డాక్టర్ నారాయణన్ ఇస్రో ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాక ఇది మొదటి ప్రయోగం. కాగా ఈ ప్రయోగం విజయవంతమైంది.
ఇది ఇస్రోకి ప్రతిష్ఠాత్మకమైమ వందవ ప్రయోగం... ఈ ఏడాది ఆరంభంలోనే నింగిలో రెండు ఉపగ్రహాలని డాకింగ్ ద్వారా రెండు కలిపి ఇస్రో సత్తా చాటింది. ఈ ఏడాది మరో రెండు డాకింగ్ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపనుంది. అతిత్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం సరిగ్గా 6.23 గంటలకు GSLV F-15 రాకెట్ని ప్రయోగించారు. రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్లోకి NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగుల్లో ఆనందం వెల్లివెరిసింది. భారత భూభాగంపై సముద్ర తీరానికి 1500 కి.మీ మేర మెరుగైన నావిగేషన్ సిస్టం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. అమెరికా తరహాలో జీపిఎస్, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల రవాణా, మొబైల్ లొకేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా GSLV సీరీస్ లో GSLV F-15 రాకెట్ ప్రయోగం 17వది. రాకెట్ పొడవు 5O.9 మీటర్లు. బరువు 420 టన్నులు. ప్రపంచ దేశాలకు మన దేశకీర్తిని ఇస్రో మరోసారి చాటింది.
ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ.నారాయణన్ కామెంట్స్
GSLV - F15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ.నారాయణన్ మాట్లాడుతూ.. శ్రీహరికోట నుండి బుధవారం ఉదయం ప్రయోగించిన GSLV - F15 రాకెట్ ద్వారా NVS -02 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి చేర్చడం జరిగిందన్నారు. ప్రయోగం జరిగిన 19 నిమిషాల 10 సెకండ్ల రాకెట్ ప్రయాణం తరువాత ఉపగ్రహం కక్షలోకి చేరుకుందన్నారు. ఈ NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ళ పాటు అంతరిక్షం నుంచి నావిగేషన్ సేవలు అందిస్తుందని, ఈ ప్రయోగ విజయం భారత దేశానికి ముఖ్యమైన మైలు రాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇస్రో ప్రయోగించిన వందవ రాకెట్ కావడంతో ప్రత్యేకత సంతరించుకుందని.. ఇస్రో విశిష్ట ప్రయోగాల అభివృద్ధిలో సతీష్ ధావన్, ఏపీజే అబ్దుల్ కలామ్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఇస్రో ఇప్పటి వరకు తన 100 ప్రయోగాల ద్వారా 548 శాటిలైట్లను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టిందని డాక్టర్ వీ.నారాయణన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News