RGV : నాపై సీఐడీ కేసును కొట్టివేయండి
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:23 AM
సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు ఆర్జీవీ
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ‘గుంటూరు జిల్లా, మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ నాపైన ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అన్నీ కట్టుకథలే. రాజకీయ దురుద్దేశంతో మానసికంగా వేధించేందుకు నాపై కేసు పెట్టారు. సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ తరువాతే 2019లో సినిమా విడుదల చేశాము. 2024లో కేసు పెట్టడంలో అర్థంలేదు. ఫిర్యాదులో నాపై నిర్దిష్ట ఆరోపణలు లేవు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసును కొట్టివేయండి. కేసు ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’ అని పిటిషన్లో ఆర్జీవీ కోరారు.