Tadepalli Palace: తాడేపల్లి కళ్లు!
ABN , Publish Date - Mar 14 , 2025 | 03:54 AM
ప్రభుత్వం మారిపోయింది.. కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని అనుకుంటే పొరపాటే! ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్కు చేరుతోంది.

బేవరేజెస్లో నేటికీ సజ్జల పెట్టిన కంపెనీ
సర్వీస్ ప్రొవైడర్గా కొనసాగుతున్న విశిష్ట
విశిష్ట కంపెనీ... ఇది బేవరేజెస్ కార్పొరేషన్కు సర్వీస్ ప్రొవైడర్! మద్యం కొనుగోళ్లు, సరఫరాకు సంబంధించిన లెక్కలన్నీ ఈ సంస్థే చూస్తుంది. అసలు విషయం ఏమిటంటే... విశిష్టకు సజ్జల ‘అస్మదీయ’ కంపెనీగా పేరు. ఈ కంపెనీ మాయలపై అనేక ఆరోపణలున్నాయి.
రాష్ట్రంలో గతేడాది అక్టోబరు 15 వ తేదీతో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి. షాపుల్లో మిగిలిన సుమారు రూ.50 కోట్ల విలువైన మద్యం ఆ రోజు రాత్రి డిపోలకు చేరింది. ఎక్కడి నుంచి, ఎంత మద్యం వచ్చిందనే లెక్క ఇప్పటికీ తేలలేదు. విశిష్ట మాయల్లో ఇదీ ఒకటని చెబుతారు! విచిత్రం ఏమిటంటే.. ఇప్పటికీ అదే సంస్థ బేవరేజెస్లోనే పాగా వేసింది.
అక్కడి నుంచే వైసీపీ నేతలకు సమాచారం
డిస్టిలరీ నుంచి డిపోల దాకా అంతా తాడేపల్లికి
మిగులు మద్యం లెక్కల్లోనూ ‘విశిష్ట’ మాయ
ఏరికోరి తెచ్చి పెట్టిన ‘సలహాదారు సజ్జల’
కంపెనీలు, కమీషన్ల లెక్కల్లో ఇదే కీలకం
తాజా సమాచారం తెలుసుకుంటూ జాగ్రత్తలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం మారిపోయింది.. కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని అనుకుంటే పొరపాటే! ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్కు చేరుతోంది. అది కూడా అడపాదడపా కాదు. చీమ చిటుక్కుమన్నా తాడేపల్లి ప్యాలె్సకు, గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిపోతోంది. మద్యంలో ఆనాడు భారీగా అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ పెద్దలకు ఇది మంచి అవకాశంగా మారింది. సజ్జల తెచ్చిపెట్టిన విశిష్ట అనే కంపెనీ ఎక్సైజ్లో సర్వీసు ప్రొవైడర్గా ఇప్పటికీ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతిరోజూ ఇచ్చే ఆర్డర్లు, డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు చేరుతున్న మద్యం లెక్కలు, అక్కడి నుంచి ఏ షాపు లు, ఏ బార్లకు వెళ్తోంది... మద్యం కంపెనీలకు ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలు... సర్వం తాడేపల్లి ప్యాలె్సకు ఈ సంస్థ ద్వారా చేరిపోతున్నాయి. నిజానికి, విశిష్ట రాకను అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ వ్యతిరేకించింది. అయినా, సజ్జల పట్టుబట్టి ఈ కంపెనీని కార్పొరేషన్లో పెట్టారు. ఒకరకంగా మొత్తం శాఖను ఆ కంపెనీ చేతిలో పెట్టారు. అయితే ప్రభుత్వం మారి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ ఆ కంపెనీనే కొనసాగిస్తోంది. ఇదే అదనుగా భావించిన ‘సజ్జల’ కంపెనీ విశిష్ట రోజువారీ ఆర్డర్లు, అమ్మకాలు మొత్తం లెక్కలను తాడేపల్లి ప్యాలె్సకు చేరవేస్తోంది. దాని ఆధారంగా మద్యం అమ్మకాల వివరాలను ట్రాక్ చేసి గత అక్రమాల లెక్కల నుంచి ఎలా తప్పించుకోవాలనే ప్రణాళికలను వైసీపీ పెద్దలు రూపొందించుకుంటున్నారు. ఇవేం పట్టని ఎక్సైజ్ శాఖ మాత్రం.. విశిష్టపై అమిత ప్రేమ చూపుతోంది,
కొత్త సీసాలో పాత సారా...
ఎక్సైజ్ శాఖ అంటే అందరికీ కనిపించేది మద్యమే. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే అది ఒక ఆదాయ వనరు. నిత్యం అనేక పన్నులు, లెక్కలతో గందరగోళంగా ఉండే శాఖ అది. అందులో నుంచి వాటాలు ఎలా రాబట్టుకోవాలనేది గత వైసీపీ ప్రభుత్వం పక్కాగా అమలుచేసి చూపించింది. అందుకోసం ఏరికోరి ఒక సర్వీస్ ప్రొవైడర్ను ఎంపిక చేసింది. అంతకుముందు ఏపీ ఆన్లైన్, సీటెల్ అనే రెండు కంపెనీలు సర్వీసు ప్రొవైడర్లుగా ఉండేవి. ఒక కంపెనీ డిస్టిలరీల నుంచి డిపోల వరకు మద్యాన్ని ట్రాక్ చేస్తే, మరో కంపెనీ డిపోల నుంచి షాపులు, బార్ల వరకు అమ్మకాలను ట్రాక్ చేసేది. అయితే ఇలా రెండు కంపెనీలు పనిచేస్తే తమ బ్రాండ్లు అమ్ముకోడానికి, కమీషన్ల వసూలుకు సాధ్యం కావట్లేదని తాడేపల్లి ప్యాలెస్ భావించింది. ఆ రెండు కంపెనీలను తప్పించి 2022లో విశిష్ట అనే కంపెనీని తెరపైకి తెచ్చింది. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఈ కంపెనీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా, సజ్జల ఒత్తిడితో ఆ కంపెనీని అనుమతించక తప్పలేదు. అన్ని స్థాయిల్లో ఆన్లైన్ సేవలు అందించినందుకుగాను విశిష్ట ఏటా రూ.కోట్లు చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతా అదే కంపెనీని కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
విశిష్ట చెప్పిందే ఫైనల్..: నిబంధనల ప్రకారం షాపులు, బార్లకు ఏ బ్రాండ్లు ఆర్డర్లు పెట్టాలనేది లైసెన్సీల ఇష్టం. తమ బార్కు ఎలాంటి మద్యం కావాలో ఆ బార్ లైసెన్సీ ఎక్సైజ్ శాఖకు ఇండెంట్ పెట్టుకుంటాడు. ఆ మేరకు శాఖ వారికి మద్యం సరఫరా చేస్తుంది. అయితే గత ప్రభుత్వంలో షాపులు ప్రభుత్వం నిర్వహించడంతో ఏ బ్రాండ్లు షాపులకు అవసరమో విశిష్టయే నిర్ణయించేది. తాడేపల్లి పెద్దలు, హైదరాబాద్లో ఉండే అప్పటి ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి సూచనలతో విశిష్ట కంపెనీయే ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేది. ఆ క్రమంలో పాపులర్ బ్రాండ్లను పక్కనపెట్టి జే బ్రాండ్లు కావాలని ఆర్డర్లు పెట్టేది. ఏ రోజు ఏం ఆర్డర్లు పెట్టారు? మద్యం షాపుల్లో ఎంత స్టాకు విక్రయించారనే వివరాలను తాడేపల్లికి పంపేది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిందన్న ఆలోచన కూడా లేకుండా తమను నియమించిన సజ్జలకు అనుగుణంగా విశిష్ట సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకు బేవరేజెస్ కార్పొరేషన్లోని కొందరు అధికారులు సహకరిస్తున్నారు.
హీల్స్ కూడా వారికే....: వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల లెక్కలన్నీ గందరగోళంగా ఉండేవి. డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యానికి, షాపుల్లో విక్రయించిన మద్యానికి చాలా సార్లు వ్యత్యాసం వచ్చేది. ఆ లెక్కలు ఏమయ్యాయో ఇప్పటికీ తేలలేదు. అప్పట్లో సజ్జల మద్యం సీసాలపై అతికించే హీల్స్ను కూడా తన చేతిలోనే పెట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన కుంబత్ అనే కంపెనీని తీసుకొచ్చి హీల్స్ కాంట్రాక్టు అప్పగించారు. అయితే కుంబత్, విశిష్టకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. డిస్టిలరీల్లో మద్యం ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేసేందుకు ప్రతి సీసాపై ఒక హీల్ను అతికిస్తారు. దాని ఆధారంగానే సీసా ఎక్కడుందనేది ట్రాక్ అవుతుంది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కో హీల్కు 28పైసలు డిస్టిలరీలు చెల్లించేవి. గత వైసీపీ ప్రభుత్వం దానిని ఒకేసారి 40పైసలకు పెంచింది. ప్రతినెల ఎక్సైజ్ శాఖకు 11కోట్ల హీల్స్ అవసరం అవుతాయి. ఆ లెక్కన ఐదేళ్లలో హీల్స్లో ఎంత దోపిడీ చేశారో అర్థమవుతోంది. పైగా ఇటీవల కుంబత్ కంపెనీకి వెంటనే నిధులు చెల్లించేలా ఆర్డర్లు జారీచేయాలని ఓ అధికారి ఒత్తిడి చేశారు. వైసీపీ తీసుకొచ్చిన కంపెనీకి నిధులు చెల్లింపు విషయంలో ప్రస్తుత అధికారులకు అంత అత్యుత్సాహం ఎందుకనే అనుమానాలు వస్తున్నాయి.