Award Winner: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న పెనుగొండ
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:16 AM
ప్రముఖ తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.

న్యూఢిల్లీ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. శనివారం ఢిల్లీలోని కమానీ ఆడిటోరియంలో లక్ష్మీనారాయణకు అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ పురస్కారాన్ని అందజేశారు. దేశ వ్యాప్తంగా 21 భాషలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రదానం చేశారు. పురస్కారంలో భాగంగా లక్ష రూపాయల నగదుతోపాటు రజత పతకం ఆయనకు లభించింది. దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి జరిపారని, అనేక గ్రంథాలు రచించారని సాహిత్య అకాడమీ ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. పెనుగొండ 1954లో పల్నాడు జిల్లాలో జన్మించారు. న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1974 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సుమారు 200కి పైగా సాహిత్య వ్యాసాలు రాసిన పెనుగొండ పలు ఇతర పురస్కారాలనూ అందుకున్నారు.