Liquor Scam Inquiry: నేడు సిట్ ముందుకు సాయిరెడ్డి
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:04 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం స్కాంలో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని నేడు సిట్ విచారించనుంది.కమీషన్ల వసూలు, హ్యాండ్లింగ్ వ్యవస్థపై వివరాలు రాబట్టే అవకాశముంది.
మద్యం స్కామ్లో విచారణ
జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ గుట్టుమట్లు తెలిసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని గురువారం సిట్ అధికారులు ప్రశ్నించ నున్నారు. మద్యం బాక్సుపై రూ.150 నుంచి 450 వరకు కమీషన్లు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు హ్యాండ్లింగ్ వ్యవస్థ, కొరియర్లతో కమీషన్లు సేకరించిన తీరు, మొత్తం నెట్వర్క్లో ఏడంచెలపై పూర్తి నిర్ధారణ కోసం విజయసాయి రెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశముంది. నిజానికి... సాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని కలిపి శుక్రవారం విచారించాలని ‘సిట్’ భావించినట్లు సమాచారం. అయితే... సాయిరెడ్డి ఆ రోజున తనకు ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలున్నాయంటూ, ఒక రోజు ముందే విచారణకు హాజరవుతున్నారు. ‘మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డే’ అని సాయిరెడ్డి ఇదివరకే బహిరంగంగా స్పష్టం చేశారు. పోలీసులు అడిగితే తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో... గురువారం ‘సిట్’ ముందు ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.