AP High Court Bail: సజ్జల, భార్గవ్లకు ముందస్తు బెయిల్
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:37 AM
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కుమారుడు భార్గవ్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో సహకరించాలని కోర్టు ఆదేశించగా, రూ.10 వేలతో పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్రెడ్డిలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలతో ఒక్కొక్కరూ రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం తీర్పు ఇచ్చారు. సజ్జల, ఆయన కుమారుడు ఇచ్చిన స్ర్కిప్ట్, ప్రోత్సాహంతోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబసభ్యులు, కమ్మ సామాజికవర్గంపై అసభ్య పదజాలంతో దూషించానంటూ సినీనటుడు పోసాని కృష్ణ మురళి నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఓబుళవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంగా ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.