Share News

Pakistan: రైలు హైజాక్.. బందీలుగా వందలాది ప్రయాణికులు

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:48 PM

బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని ప్రయాణికుల రైలుపై కాల్పులతో దాడి చేశారు. రైలు ఆగగానే వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు మిలటరీ సిబ్బందిని ప్రాణాలు కోల్పోయారు.

Pakistan: రైలు హైజాక్.. బందీలుగా వందలాది ప్రయాణికులు
Pak Train Hijack

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో వేర్పాటువాదులు విరుచుకుపడ్డారు. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని ప్రయాణికుల రైలుపై కాల్పులతో దాడి చేశారు. రైలు ఆగగానే వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు మిలటరీ సిబ్బందిని ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే పాల్పడినట్టు వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. బలోచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖారబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు సుమారు 400 మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


ఘటన వివరాల ప్రకారం ఉగ్రవాద సంస్థ రైల్వేట్రాక్‌ను పేల్చేయడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. వెంటనే మిలిటెంట్లు రైలును తమ అధీనంలోకి తెచ్చుకుని ప్రయాణికులను బంధించారు. ఆరుగురు ఆర్మీ సిబ్బందిని కాల్చిచంపినట్టు, 120 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్న బీఎల్ఏ ప్రకటించింది. తమపై మిలటరీ చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పని, బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది.


కాగా, సమాచారం తెలియగానే తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. బలోచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం, పాకిస్థాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావం డిమాండ్‌తో 2000లో బీఎల్ఏ ఏర్పడింది. అప్పట్నించీ పలు హింసాత్మక దాడులకు పాల్పడటంతో ఆ సంస్థను పాక్‌, అమెరికా, యూకేలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

Updated Date - Mar 11 , 2025 | 06:20 PM