Share News

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:58 PM

దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. అయితే అంత మంది ఖాతాలను వాట్సాప్ ఎందుకు తొలగించింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
WhatsApp Removes

భారతదేశంలో సోషల్ మీడియా వినియోగం విషయంలో నిబంధనలను ఆయా సంస్థలు మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ కోట్ల కొద్ది అకౌంట్లను తొలగించగా, తాజాగా అదే బాటలోకి మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కూడా చేరింది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ 2025 జనవరి 1 నుంచి 30 వరకు ఒక్క నెలలోనే దాదాపు 99 లక్షల (10 మిలియన్లు) భారతీయ ఖాతాలను నిషేధించింది. ఇది కంపెనీకి సరికొత్త రికార్డని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే నెలలో ఈ స్థాయిలో అకౌంట్లను తొలగించడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు.


నిషేధానికి కారణాలు

భారతదేశంలో వాట్సాప్ వినియోగదారులు అనేక మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ఈ యూజర్లలో అనేక మంది సామాన్య వ్యక్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులతోపాటు స్పామర్లు, మోసగాళ్లు, హ్యాకర్లు కూడా ఉన్నారని తేలింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ చేసిన తనిఖీల్లో భాగంగా భద్రతను మరింత కఠినతరం చేసేందుకు, డేటా దుర్వినియోగం చేస్తున్న ఖాతాలను తొలగించింది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక ఖాతాలపై నిషేధం విధించింది. ఈ క్రమంలో చాట్‌లు, ప్రైవసీ, ఇతరులు పంపే సందేశాలు కూడా నిషేధానికి కారణమవుతున్నాయి. వాట్సాప్ ప్రధాన లక్ష్యం యూజర్ ప్రైవసీని దుర్వినియోగం చేయకుండా ఉండటమే.


99 లక్షల ఖాతాల నిషేధం

జనవరి 1 నుంచి 30, 2025 మధ్య కాలంలో వాట్సాప్ 99 లక్షల ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలు వివిధ కారణాలతో నిషేధించబడ్డాయి. వాటిలో నకిలీ ఖాతాలు, స్పామ్ సందేశాలు పంపడం, అనుమానాస్పద కార్యకలాపాలు సహా అనేక వాట్సాప్ విధానాలను ఉల్లంఘించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ నిషేధ చర్యలో భాగంగా దాదాపు 13.27 లక్షల ఖాతాలను ముందుగా, యూజర్ ఫిర్యాదులు అందకముందే, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వాట్సాప్ భద్రతా వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్లు వాట్సాప్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సందేశాలు పంపిస్తే మీ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


అనుమానాస్పద ఖాతాలను గుర్తించడం

వాట్సాప్ భద్రత కోసం ఇప్పటికే ఆటోమేటెడ్ సిస్టమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇది ఒక వినియోగదారుల కార్యాచరణను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు ఒక ఖాతా నుంచి ఎక్కువమంది యూజర్లకు స్పామ్ సందేశాలు పంపితే లేదా నకిలీ సమాచారాన్ని పంపిస్తే, సిస్టమ్ వెంటనే ఆ ఖాతాను గుర్తించి, చివరకు నిషేధిస్తుంది. ఇటీవల కాలంలో ఆటోమేటెడ్ సిస్టమ్ అనుమానాస్పద అంశాలను త్వరితగతిన గుర్తించి చర్య తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత సురక్షితంగా, నమ్మకంగా ఉంచడంలో సహకరిస్తుంది.


వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం

వాట్సాప్ ద్వారా వినియోగదారులు వేధింపులు, స్పామ్ సందేశాలు లేదా మోసపూరిత కార్యకలాపాలను ఎదుర్కొన్నప్పుడు, వాటి గురించి ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఇప్పటికే 9,474 వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు, WhatsApp 239 ఖాతాలను నిషేధించింది. ఈ క్రమంలో వినియోగదారుల ఫిర్యాదులపై కూడా మరింత వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది వాట్సాప్.


ఇవి కూడా చదవండి:

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 22 , 2025 | 02:59 PM