Share News

ఊపందుకున్న పనులు

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:36 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి సమీపంలోని భూధాన్‌ యజ్ఞ బోర్డు భూముల్లో నాలుగెకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టగా, గత అక్టోబరు 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు.

ఊపందుకున్న పనులు
నిర్మాణంలో ఉన్న శివుడి విగ్రహం

- అన్ని సౌకర్యాలతో హిందూ శ్మశాన వాటిక

- రూ. 4 కోట్లతో నాలుగు ఎకరాల్లో నిర్మాణం

- ఒకేసారి ఎనిమిది దహన సంస్కారాలకు అవకాశం

- శివరాత్రికి అందుబాటులోకి..

మంచిర్యాల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి సమీపంలోని భూధాన్‌ యజ్ఞ బోర్డు భూముల్లో నాలుగెకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టగా, గత అక్టోబరు 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటికకు ప్రహరీ, ఇతర నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రజల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. శ్మశాన వాటిక నిర్మాణం పూర్తయితే ఇంతకాలం హిందూ ప్రజలు దహన సంస్కారాలకు పడుతున్న బాధలు తీరే అవకాశాలు ఉన్నాయి.

- వసతులు ఇలా....

హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలకు అవసరమైన అన్ని వసతులు కల్పించే విధంగా శ్మశాన వాటిక నిర్మాణాన్ని చేపట్టారు. ఒకేసారి ఎనిమిది మృతదేహాలను దహనం చేసే విధంగా ప్లాట్‌ఫాం నిర్మాణం చేపడుతున్నారు. దహన సంస్కారాల సందర్భంగా కుటుంబ సభ్యులు, ఇతర బంధువర్గం వీక్షించేందుకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా బాత్రూంలు, టాయ్‌లెట్ల నిర్మాణం చేపడుతున్నారు. శ్మశాన వాటిక మధ్యలో గ్రీనరీతో కూడిన పార్క్‌ను నిర్మిస్తున్నారు. దహన సంస్కారాల సమయంలో శివనామస్మరణ కోసం శ్మశాన వాటిక ఆవరణలో 20 ఫీట్ల ఎత్తైన శివ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫాంను నిర్మిస్తున్నారు. అలాగే వాహనాల పార్కింగ్‌ కోసం గోదావరి రోడ్డు నుంచి 30 మీటర్ల మేర ఏర్పాట్లు చేస్తున్నారు. దహన సంస్కారాల అనంతరం స్నానాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుండగా, గోదావరి స్నానం చేయాలన్న కుతూహలం ఉన్నవారికి నది సమీపంలోనే ఉండటంతో ఆ అవకాశం కూడా ఉండనుంది.

- కిరాయిదారులకు ప్రత్యేక వసతి...

వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చి, ఇక్కడ కిరారుకి ఉంటున్న స్థానికేతరుల కోసం శ్మశాన వాటికలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కిరాయికి ఉండేవారి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని యజమానులు ఇంట్లోకి అనుమతించడం లేదు. దహన కార్యక్రమాల అనంతరం 11 రోజుల పాటు జరిగే కర్మలు పూర్తయ్యే వరకు కూడా వారిని యజమానులు ఇళ్లలోకి రానివ్వడం లేదు. దీంతో అంత్యక్రియలు నిర్వహించిన నాటి నుంచి కార్యక్రమాలు ముగిసే వరకు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేనిచోట మహిళలు, పిల్లలతోపాటు ఉండాల్సి వస్తోంది. చలి, ఎండావానల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కిరాయిదారుల అవస్థలను ధృష్టిలో పెట్టుకుని శ్మశాన వాటిక నిర్మాణంలో వారికి ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా గదుల నిర్మాణం చేపడుతున్నారు. ఆ గదుల్లో కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఉండేలా అవసరమైన మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నారు. హిందూ మతస్థులు దహన సంస్కారాలు, కర్మకాండల కోసం దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులు నూతనంగా నిర్మించబోయే స్మశాన వాటికతో తొలగిపోనున్నాయి.

- శివరాత్రికి అందుబాటులోకి...

మహా ప్రస్థానం పేరుతో నిర్మిస్తున్న శ్మశానవాటిక నిర్మాణ పనులు శివరాత్రికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మహాప్రస్థానం నిర్మాణ పనులు పూర్తిచేసి, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. శ్మశాన వాటిక నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే నిర్మాణ పనులు పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్టర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా శ్మశానవాటిక లేక జిల్లా కేంద్రంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో శ్మశాన వాటిక కోసం చందాలు వసూలు చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎట్టకేలకు శ్మశాన వాటిక నిర్మాణ కల నెరవేరుతుండగా, త్వరలో ప్రారంభానికి సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Feb 11 , 2025 | 11:36 PM