Krishank: కంచ గచ్చిబౌలి భూముల వివాదం విచారణకు హాజరైన మన్నె క్రిశాంక్
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:44 AM
బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ కంచ గచ్చిబౌలి భూముల విషయంపై గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ కంచ గచ్చిబౌలి భూముల విషయంపై గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ధరించిన టీ షర్ట్పై ‘సుప్రీం కోర్టు రాక్స్’ అని ఇంగ్లీషులో రాసి ఉంది. అంతకు ముందు ఈ నెల 9వ తేదీన పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సైతం క్రిశాంక్ నల్ల రంగు టీ షర్ట్ను ధరించగా దానిపై ‘డెమోక్రసీ’ అనే ఇంగ్లీషు పదంలో ఆర్ఆర్ అనే రెండు అక్షరాలు పెద్దగా ముద్రించి ఉన్నాయి. ఇలా రెండుసార్లు పోలీసుల విచారణకు తనదైన శైలిలో ఒక సందేశం ఉన్న టీ షర్టులను ధరించి ఆయన హాజరయ్యారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై నమోదైన 4 కేసులకు సంబంధించి పోలీసులు క్రిశాంక్ను విచారించారు. సుమారు 6 గంటలకు పైగానే ఆయన పోలీ్సస్టేషన్లో ఉన్నారు. ఫేక్ వీడియోలు వైరల్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదు కాగా, పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా మాధ్యమమైన ‘ఎక్స్’లో కంచ గచ్చిబౌలి భూములపై చేసిన పోస్టులపైనే పోలీసులు ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం.
ఉదయం పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టారు : క్రిశాంక్
విచారణ పేరుతో పోలీసులు ఉదయం పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. మళ్లీ 23న నాలుగో సారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం వేధిస్తోంది. హెచ్సీయూ అడవుల్లో జింకలు చనిపోయాయని, ఆ భూములపై రేవంత్ రెడ్డి భూదందా చేశారని, రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్నాడని సీఈసీ చెప్పింది. హెచ్సీయూ భూముల్లో 1,524 చెట్లు కొట్టేశారని సీఈసీ నివేదిక ఇచ్చింది. ఇవేవీ కృత్రిమ మేధ కాదు కదా? సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తుంటే, ఆయన ఆ కోపాన్ని మా మీద ఇలా తీర్చుకుంటున్నాడు. పదే పదే ఎందుకు పిలుస్తున్నారు. ప్రభుత్వ వేధింపులపై న్యాయపోరాటం చేస్తాం. అనవసరమైన బెదిరింపులకు భయపడేది లేదు.