Kaleshwaram Project: సరస్వతీ బ్యారేజీలో ఇసుక నిల్వలపై లైడార్ సర్వే ప్రారంభం
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:16 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతీ (అన్నారం) బ్యారేజీ నుంచి సుందిళ్ల వరకు గోదావరి నదిలో ఇసుక నిల్వల పరిమాణంపై శనివారం డ్రోన్ లైడార్ సర్వే నిర్వహించారు.

భూపాలపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతీ (అన్నారం) బ్యారేజీ నుంచి సుందిళ్ల వరకు గోదావరి నదిలో ఇసుక నిల్వల పరిమాణంపై శనివారం డ్రోన్ లైడార్ సర్వే నిర్వహించారు. గోదావరి, మానేరు నదుల్లో రెండేళ్లుగా దాదాపు రూ.2.54 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక పేరుకుపోయినట్లుగతంలో ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూర్తి స్థాయి సర్వే చేయించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మను ఆదేశించింది. దాంతో ఆ సర్వే నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ క్రమంలో మానేరు నదికి సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లో సమావేశమైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సర్వే జరిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మానేరు నదికి సంబంధించి సర్వే నిర్వహిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు.