Jupally Krishna Rao: అప్పులు చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:46 AM
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయలేద ని నిరూపిస్తే తాను మంత్రి పదవి సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తానని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. శాసన మండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పారు.

రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు: జూపల్లి
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయలేద ని నిరూపిస్తే తాను మంత్రి పదవి సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తానని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. శాసన మండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ కారణంగా నెలకు రూ. 6500 కోట్ల చొప్పున ఏటా సుమారు రూ.75వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 19మంది సీఎంలు దాదాపు 65వేల కోట్లు అప్పులు చేస్తే కేవలం పదేళ్లలో కేసీఆర్ రూ.7.11 లక్షల కోట్లు అప్పులు చేశారని వివరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఒక్క సారిగా సీట్ల మీది నుంచి లేచి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అప్పులపై చేసిన వాఖ్యలు వాస్తవం కాదని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని జూపల్లి ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అధికార పార్టీ సభ్యుడు బల్మూరి వెంకట్ కలుగజేసుకున్నారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించడంతో ప్రజలు బీఆర్ఎ్సను అధికారం నుంచి తరిమివేశారన్నారు. దీంతో మండలిలో కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.