Tummla: రుణమాఫీ రూ.2 లక్షల వరకే!
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:31 AM
రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రూ.2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పామని, వారందరికీ పూర్తి చేశామని అన్నారు.

అంతకన్నా ఎక్కువ ఉంటే మాఫీయే లేదు
25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ పూర్తి
గత ప్రభుత్వం చేసిన మాఫీ 3500 కోట్లే: తుమ్మల
హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రూ.2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పామని, వారందరికీ పూర్తి చేశామని అన్నారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న వారికి రుణమాఫీ ఉండదని చెప్పారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘‘రైతుల అప్పులు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వం రుణమాఫీ నిర్ణయం తీసుకుంది.
రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రత్యేకంగా చెప్పదలచుకున్నాను. అదేంటంటే.. రూ.2 లక్షల వరకే రుణమాఫీ. దీనికి సంబంధించి 25 లక్షల కుటుంబాల లెక్కలు మా దగ్గరకు చేరాయి. వారికి రూ.20,616 కోట్ల మాఫీ నిధులు జమ చేశాం. రూ.2 లక్షలకుపైన రుణమాఫీ లేదు’’ అని అన్నారు.