క్వారంటైన్‌ కేంద్రాల్లో 125 మంది డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-04-09T12:18:04+05:30 IST

జిల్లాలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న 125 మంది కరోనా అనుమానితులను బుధవారం డిశ్చార్జి చేయగా, కొత్తగా పది

క్వారంటైన్‌ కేంద్రాల్లో 125 మంది డిశ్చార్జి

చిత్తూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న 125 మంది కరోనా అనుమానితులను బుధవారం డిశ్చార్జి చేయగా, కొత్తగా పది మంది చేరారు. మొత్తం 14 క్వారంటైన్‌ కేంద్రాలకు గాను, 9 కేంద్రాల్లో ఇప్పటి వరకు 548 మంది అనుమాతులను అబ్జర్వేషన్‌లో ఉంచారు. 125 మందికి డిశ్చార్జి అవడం, పలువురు కొత్తగా రావడంతో ఇన్‌మేట్స్‌ సంఖ్య 433 మందికి చేరింది. క్వారంటైన్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగిన 617 సింగిల్‌రూమ్స్‌ను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. కరోనా అనుమానితులను అబ్జర్వేషన్‌లో ఉంచాలంటే కచ్చితంగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 


డిశ్చార్జి వివరాలివీ... 

తొమ్మిది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న 125 మంది బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఇందులో భాగంగా మదనపల్లె వశిష్ట పాఠశాల క్వారంటైన్‌ కేంద్రంలో నలుగురు, తిరుపతి పద్మావతి నిలయం కేంద్రంలో 28మంది, పలమనేరు మదర్‌థెరిసా ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో 93 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో పలమనేరు క్వారంటైన్‌ కేంద్రం పూర్తిగా ఖాళీ అయింది. బుధవారం కొత్త పది మంది అనుమానితులు క్వారంటైన్‌కు వచ్చారు. విశ్వం ఇంజనీరింగ్‌ కళాశాల, కలికిరి జేఎన్‌టీయూ, వరదయ్యపాళెం ఏకం క్యాంపస్‌, కుప్పం ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో ఒకరి వంతున, తిరుపతి పద్మావతి నిలయం కేంద్రంలో ఆరుగురు చేరారు. 

Updated Date - 2020-04-09T12:18:04+05:30 IST