కేంద్ర బలగాల్లో కొత్తగా 175 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-07-08T05:29:17+05:30 IST

కేంద్ర సాయుధ పోలీసు బలగాలైన బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్‌లలో ఇవాళ కొత్తగా..

కేంద్ర బలగాల్లో కొత్తగా 175 మందికి కరోనా

న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాలైన బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్‌లలో ఇవాళ కొత్తగా 175 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. 2.5 లక్షల మంది సిబ్బంది ఉన్న బీఎస్ఎఫ్‌లో కొత్తగా 69 మందికి కోవిడ్-19 సోకినట్టు గుర్తించారు. గడచిన 24 గంటల్లో 29 మంది కోలుకున్నారు. బీఎస్ఎఫ్‌లో ఇప్పటి వరకు 1,454 మందికి ఇన్ఫెక్షన్ సోకగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 595 మంది మినహా అందరూ కోలుకున్నారు. తాజాగా మరో జవాను మృతి చెందడంతో బీఎస్ఎఫ్‌లో కరోనా మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది. 


ఇక ఐటీబీపీలో గడచిన 24 గంటల్లో మరో ఏడుగురికి కరోనా వైరస్ సోకగా.. ఆరుగురు కోలుకున్నారు. ఇప్పటి వరకు ఐటీబీపీలో 431 మందికి కరోనా సోకగా.. ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 152 మంది చికిత్స పొందుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌లో ఇవాళ కొత్తగా 99 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. ఇప్పటి వరకు సీఆర్పీఎఫ్‌లో 1734 మంది కొవిడ్ బారిన పడగా.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 941 మంది చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2020-07-08T05:29:17+05:30 IST