కరోనా టీకాలపై బ్రిటన్ అధికారి సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2020-10-28T18:18:11+05:30 IST

శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. తొలి తరం టీకాల విషయంలో అతి విశ్వాసం కూడదని, మాస్కులు, సామాజిక దూరం వంటి నియమాలు కచ్చితంగా పాటించాలని చెబుతూ వస్తున్నారు. అయితే..తాజాగా ఈ అంశంపై బ్రిటన్ ఉన్నాతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా టీకాలపై బ్రిటన్ అధికారి సంచలన వ్యాఖ్యలు!

లండన్: శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. తొలి తరం టీకాల విషయంలో అతి విశ్వాసం కూడదని, మాస్కులు, సామాజిక దూరం వంటి నియమాలు కచ్చితంగా పాటించాలని చెబుతూ వస్తున్నారు. అయితే..తాజాగా ఈ అంశంపై బ్రిటన్ ఉన్నాతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి తరం టీకాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవచ్చని బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేక కరోనా టీకా టాస్క్ ఫోర్స్‌ చీఫ్ కేట్ బింగమ్ వ్యాఖ్యానించారు. ఇవి పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోయే అవకాశం ఉందని, కరోనా నుంచి ప్రతి ఒక్కరినీ ఇవి రక్షించలేకపోవచ్చని తెలిపారు. కరోనా టీకా కోసం ప్రపంచమంతా వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వ ఉన్నతాధికారి చేసిన ఈ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 


‘అసలు మనకు ఎప్పటికైనా కరోనా టీకా అందుబాటులోకి వస్తుందా రాదా అనే దానిపై సందేహాలు ఉన్నాయి. అందుకే..మనం అంతాబాగానే ఉంటుందిలే అనే అలోచన ధోరణి ప్రబలకుండా జాగ్రత్తపడాలి. అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తొలి తరం వ్యాక్సిన్లు కరోనా నుంచి పూర్తి రక్షణను ఇవ్వలేకపోవచ్చు. కరోనా సోకకుండా ఆప లేకపోవచ్చు. కేవలం..వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గించవచ్చు. ఇది కూడా ప్రతి ఒక్కరి విషయంలో నిజం కాకపోవచ్చు. మనం ఆశిస్తున్న సుదీర్ఘ రక్షణను కూడా ఇవ్వలేకపోవచ్చు.ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం సిద్ధంగా ఉండాలి’ అని ఆమె తెలిపారు.


అంతేకాకుండా.. తొలి తరం టీకాల్లో అనేకం విఫలమవొచ్చని, అన్నీ విఫలమైనా అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక.. 65 ఏళ్లు పైబడిన వారికి రక్షణ కల్పించే టీకాలకే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ప్రపంచానికి కోట్ల సంఖ్యలో కరోనా డోసుల అవసరం ఉందని, కానీ..ప్రస్తుతమున్న టీకా తయారీ సామర్థ్యం అసలేమాత్రం సరిపోదని తేల్చి చెప్పారు. బ్రిటన్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని అన్నారు.


తగ్గిపోతున్న కరోనా రోగనిరోధక శక్తి!

కాగా.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు మంగళవారం నాడు ఓ కీలక అధ్యయానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక వ్యవస్థ స్థితిగతులకు సంబంధించిన అధ్యయనం ఇది. కరోనా నుంచి రక్షించే యాంటీబాడీల సంఖ్య  బ్రిటన్ ప్రజల్లో క్రమంగా తగ్గుతోందని, వారిలో ఈ శక్తి తక్కువ కాలం పాటు మాత్రమే ఉనికిలో ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో సామాజిక స్థాయిలో కరోనా రోగనిరోధశక్తి వేగంగా తగ్గిపోవచ్చనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రెండో సారి కరోనా దాడిచేయచ్చనే అంచనాతో బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ప్రముఖ టెలిగ్రాఫ్ పత్రిక కూడా ఇటీవలే ప్రచురించింది. 

Updated Date - 2020-10-28T18:18:11+05:30 IST